ఏపీ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. ఏపీ సర్కారుకు షాక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలనానికి తెరతీశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం కోరిన గంటల్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. జనవరి 23వ తేదీ నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.
నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఈ నెల 23న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందని చెప్పారు.
ఇక, ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ, ఫిబ్రవరి 13 మూడో దశ, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ప్రకటించారు. ఇక, పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు.
