1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 8 జులై 2021 (14:52 IST)

రోడ్డు ప్ర‌మాదంలో ఎన్నారై దంప‌తుల దుర్మ‌ర‌ణం

పెళ్ళయిన కొద్ది రోజుల‌కే ఆ న‌వ దంప‌తుల క‌ల చెదిరింది. రోడ్డు ప్ర‌మాదం వారి జీవితాల‌ను ప‌రిస‌మాప్తం చేసి, బంధువ‌ల‌ను దుఖ: సాగ‌రంలో ముంచెత్తింది. అనంత‌పురం జిల్లా రాప్తాడులో జ‌రిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంట్లో పెళ్లి ఆనందాన్ని చెరిపేసింది. అనంతపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఎన్‌ఆర్‌ఐ ఉద్యోగులు రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  
 
అనంతపురానికి చెందిన విష్ణువర్దన్ (28), కడపకు చెందిన కుల్వ కీర్తి (25) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. గత నెల జూన్‌ 19న వీరికి పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. న‌వ దంప‌తులు ఇద్ద‌రూ రెండు రోజుల క్రితం బెంగళూరులోని బంధువుల వద్దకు వెళ్లారు. కారులో అనంతపురానికి తిరుగు ప్రయాణమవ‌గా, బొమ్మేపర్తి గ్రామ సమీపంలో రోడ్డు దాటే సమయంలో ద్విచక్ర వాహనం కారుకు అడ్డుగా వచ్చింది. దాన్ని తప్పించబోయి కారు డివైడరును ఢీకొట్టి అటువైపు దారిలో వస్తున్న కంటైనర్‌కు ఢీకొని, రోడ్డు దిగువన ఉన్న గోతిలో పడింది.

కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు 108లో కుల్వ కీర్తిని అనంత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. విష్ణువర్దన్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాప్తాడు పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
 
విష్ణువర్దన్‌ తండ్రి సుధాకర్‌ నాయుడు సహాయ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కీర్తి తండ్రి కడపలో పంచాయతీ రాజ్ శాఖలో డీఈగా పని చేస్తున్నారు. దంపతులిద్దరూ ఈ నెల 25న అమెరికాకు తిరుగు ప్రయాణం కోసం విమాన టికెట్లు కూడా సిద్ధం చేసుకున్నారు. అంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.