1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (08:05 IST)

స్థానిక పోరుకు అధికారుల సన్నద్ధం

పురపాలక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

డిసెంబరు మార్చి మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు ఎన్నికల్నీ ఒకేసారి నిర్వహించాలా...? లేక వే వేరుగా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రంలోని 12,918 పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం గత ఏడాది ఆగస్టు ఒకటితో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది.

సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుపై... సుప్రీంకోర్టు తదుపరి ఎన్నికల్లో 50 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది.

రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు, జిల్లాల్లో బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశామని అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు.