శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (12:30 IST)

నారా లోకేశ్ "యువగళం"పై ప్రెస్ నోట్ .. మార్పుకోసం యువగళం గొంతెత్తాలి..

yuvagalam
తెలుగుదేశం పార్టీ 'యువ గళం' అనే పేరుతో మరో వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర అభివృద్ధి ఎజెండా నిర్ధారణ ప్రక్రియలో యువతను భాగస్వామ్యులను చేసేలా, రాష్ట్ర యువతకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు, మార్పును కోరే విధంగా తమ గళాన్ని వినిపించేందుకు యువ గళం దోహదపడుతుంది.
 
టీడీపీ చేస్తున్న "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చి తమ సమస్యలను లేవనెత్తుతున్నారు. ఫలితంగా, తెలుగుదేశం పార్టీ యువ గళం వేదికను ఆంధ్రప్రదేశ్ యువతకు పరిచయం చేస్తూ, ఈ యాత్రను నడిపించే బాధ్యతను నారా లోకేష్‌కు అప్పగించింది.
 
ఈ జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి నారా లోకేష్ 400 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4000 కి.మీ మేరా కుప్పం నుండి ఇచ్చాపురం దాకా ప్రయాణించి యువత మరియు తదితరుల గళాలను కలిపేందుకు, వారికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాడేందుకు యువ గళం ద్వారా వేదిక కల్పించనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ గత 3.5 సంవత్సరాల నుండి పీడించబడుతోంది. 1.5 కోట్ల మందికి పైగా నిరుద్యోగులున్న మన రాష్ట్రంలో ప్రతి 4 రోజులకు ఒకరు నిరుద్యోగ సమస్య వలన ఆత్మహత్యకు పాల్పడుతున్న దుస్థితి. దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్న ఘనత మన రాష్ట్రానిది. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో, పెట్రోలు, డీజిల్ పై అత్యధిక ధరలు చెల్లించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. 
 
గత మూడున్నరేళ్ల కీచకపాలనలో రాష్ట్రంలో ప్రతి ఎనిమిది గంటలకు ఒక మహిళ అఘాయిత్యానికి గురవుతున్న పరిస్థితి. డ్రగ్స్ మరియు మధ్యపాన వినియోగం విషయంలో మాత్రమే మన రాష్ట్రం నిస్సందేహంగా ముందంజలో ఉంది. గత మూడున్నరేళ్లలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారమయంగా మారింది.
 
యువతకు రాష్ట్ర అభివృద్ధిలో మరియు చట్ట సభలలో ప్రాతినిథ్యం కరువైంది. రాష్ట్ర జనాభాలో సగభాగమైన యువతకు లోక్‌సభలో కేవలం 12 శాతం ప్రాతినిధ్యం మాత్రమే లభించింది ఈ ప్రభుత్వ హయాంలో, ఇదా మన రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన న్యాయం? 
 
నారా లోకేశ చేపట్టిన 'యువగళం' కార్యక్రమం, రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ తద్వారా ప్రస్తుత పాలనలో ప్రబలంగా ఉన్న సమస్యలపై ఏపీ యువతకు, ఓటర్లకు అవగాహన కల్పించే లక్ష్యంతో కొనసాగనుంది.
 
యువ గళం అనేది యువత మరియు తదితరులు ముందడుగు వేసేందుకు ఒక అవకాశం కల్పించే వేదిక. ఈ వేదిక ద్వారా...
 
1) పాల్గొనండి
400 రోజుల సుదీర్ఘ యాత్రలో ప్రముఖ యువ సెలబ్రిటీలు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్లను కలిసే అవకాశంతో పాటు వివిధ రకాల ఇంటరాక్టివ్ సెటప్ ద్వారా నారా లోకేష్ కనెక్ట్ అయ్యే అవకాశం.
 
2) గళాన్ని వినిపించండి
రాష్ట్రంలోని దుష్పరిపాలనకు ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ, తెలుగు ఓటర్లకు మద్దతుగా మీ గొంతు వినిపించేందుకు అవకాశం..
 
3) అజెండాను నిర్ధారించండి
వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ దృష్టిని యువత సమస్యలపై మళ్లించేందుకు మరియు యువ ఆధారిత ఎజెండాని రూపొందించే ప్రతిపాదనకు అవకాశం ప్రజలు 96862 96862కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా YuvaGalam.com పై సైనస్ అయ్యి పాల్గొనవచ్చు.
 
ఈ కొత్త సంవత్సరంలో తెలుగు యువత మన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోదు. అభివృద్ధి లేని, బాధలతో నిండిన స్థితిలోకి జారుకున్న రాష్ట్రంలోకి యువత ముందడుగు వేయబోదు.
 
మార్పు ఈ సంవత్సరం తీర్మానంగా మార్చుదాం.
లోకేష్‌తో కలిసి నడుద్దాం. మెరుగైన ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ముందుకు సాగుదాం.