శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 10 జనవరి 2020 (16:37 IST)

రోజాకు ధైర్యం చెప్పిన జగన్, ఆనందంగా కనిపించిన నగరి ఎమ్మెల్యే

చిత్తూరులో జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో ఆసక్తికర చర్చ జరిగింది. అది కూడా నగరి ఎమ్మెల్యే రోజా... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ మాట్లాడుకోవడం మరింత చర్చకు దారితీసింది. సుమారు పది నిమిషాల పాటు అధినేతతో మాట్లాడారు రోజా. అది కూడా ఆవేశంగా మాట్లాడటంతో నీళ్ళ గ్లాసును పక్కకు జరిపిన జగన్ తాగమని సైగ చేశారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
 
నగరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా ఈమధ్య సొంత పార్టీ కార్యకర్తలతో ఇబ్బంది పడుతున్నారు. గత నాలుగు రోజుల ముందు పుత్తూరు మండలం కెబిఆర్ పురంలో గ్రామ సచివాలయ శంఖుస్థాపనకు వెళ్ళిన రోజాను స్థానిక వైసిపి నేతలు అడ్డుకున్నారు. గ్రామ సచివాలయాన్ని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజా కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు కూడా.
 
దీంతో రోజాను పోలీసులు కాపాడి అక్కడి నుంచి పంపేశారు. అయితే తనపై దాడికి సంబంధించి వైసిపి కార్యకర్తల మీదే కేసులు పెట్టారు రోజా. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జనం రోజాపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆమె ఎప్పుడూ తమ గ్రామంలోకి రాలేదని.. అభివృద్థి పథకాలు అందలేదని ఎమ్మెల్యేకు చెబుతామంటే ఆమె అందుబాటులో లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇది కాస్త రోజాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
 
అంతేకాదు పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలే తనపై బురదజల్లించే ప్రయత్నం చేస్తన్నారంటూ రోజాకు తెలిసింది. ఇది కాస్త జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలనుకున్నారు రోజా. చిత్తూరుకు వచ్చిన జగన్‌ను సభలో ఆమె కలిశారు. పది నిమిషాల పాటు జరిగిన విషయాన్నంతా వివరించారు. 
 
కావాలనే తనపై దాడి చేయించారని.. మన పార్టీ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని.. ఇలా ఒక్కొక్కటిగా చెబుతూ వచ్చారు రోజా. అయితే సిఎం మాత్రం అన్నింటిని విని.. తన ఎదురుగా ఉన్న నీటి గ్లాసును రోజా పక్కకు జరిపి తాగమ్మా అంటూ సైగ చేశారు. అంతే కాదు ఆమె తలను నిమురుతూ మెల్లగా నవ్వారు. దీంతో రోజాకు ధైర్యమొచ్చింది. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ తరువాత తన మనస్సులోని భారాన్ని తొలగించుకున్న సంతోషంతో ఆమె నవ్వుతూ కనిపించారు.