శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (08:35 IST)

ఉచిత విద్యుత్ పై పేటెంట్ వైయస్ కే ఉంది.. బెల్ట్ షాపులపై పేటెంట్ చంద్రబాబుది: సజ్జల రామకృష్ణారెడ్డి

ఉచిత విద్యుత్ పై పేటెంట్ వైయస్ కే ఉంది.. బెల్ట్ షాపులపై పేటెంట్ చంద్రబాబుదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
 
" రైతులకు ఉచితంగా వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా చేసే స్కీంలో భాగంగా.. అందరికీ ప్రయోజనం కలిగేలా, రైతుకు శాశ్వతంగా ఒక నమ్మకమైన, నాణ్యమైన, గ్యారెంటీ టైంతో కూడిన, ఉచిత  విద్యుత్‌ జీవో తెస్తే.. టీడీపీ, కొన్ని ఆర్కెస్ట్రా పార్టీలు, సృష్టించిన అపోహాలపై కొంతమంది రైతుల్లో అనుమానాలు, సందేహాలు కలుగుతున్నాయి.
 
- ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ నిర్ణయం పట్ల అంతా సానుకూలంగా స్పందించాలి, సానుకూలంగా స్వీకరించాల్సిన సమయం ఇది, ఈ సంస్కరణలపై దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలు చూస్తే ప్రజలు ఎవరైనా నమ్ముతారా..
 
ఈ అపోహలు, అనుమానాలు తొలగించి, వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, 
-నిజానికి ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ సంస్ధలు అప్పులబారిన పడి వేల కోట్ల రూపాయలు బకాయిలు మోయలేక కునారిల్లుతుంటే వ్యవస్ధ మొత్తం దెబ్బతిన్న పరిస్దితి అందరం చూశాం.

దీనినుంచి డిస్కంలు ఎలా బయటపడతాయి, అదే సమయంలో కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న సవరణలు మనమీద పడే అవకాశం కనిపిస్తుంటే, దానికి తగిన విధంగా మనం సమాయత్తమవ్వకపోతే వచ్చే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏ ప్రభుత్వం అయినా ఏం చేయాలో, విమర్శలు వస్తాయని తెలిసి కూడా నిబద్దత, దమ్ము ఉన్న నాయకుడిగా జగన్‌ మేలి సంస్కరణల దిశగా ముందడుగు వేశారు.
 
నిజానికి ఉచిత విద్యుత్‌ పథకం ఎవరో పోరాడి సాధించుకున్నది కాదు, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ప్రాజెక్ట్‌ల ఖర్చు పెద్ద మొత్తంలో అవుతుంది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి కరెంట్‌ కూడా ఇవ్వకపోతే రైతులకు ఎలా అని సరైన ఆలోచనతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ కాదన్నా... ఒంటిచేత్తో పోరాడి సాధించిన పథకం ఇది. వైయస్ఆర్ మదిలో నుంచి పుట్టిన పథకం ఇది. 
 
గతంలో చంద్రబాబు హయాంలో... విద్యుత్ హార్స్‌పవర్‌ రూ. 50 నుంచి రూ. 650కు పెంచిన పెద్దమనిషి, ఎడాపెడా కరెంట్‌ చార్జీలు పెంచి వేలమంది రైతులను దెబ్బకొట్టాడు, ఆఖరికి కరెంట్‌ చార్జీల పెంపుపై రోడ్డు ఎక్కితే ప్రాణాలు తీశాడు, ఇవన్నీ చూసిన తర్వాతే ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని తేవాలని అనుకున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేయడంతో పాటు, అప్పటివరకూ ఉన్న విద్యుత్ బకాయిలు కూడా మాఫీ చేశారు. దీనిపై ఎవరికైనా పేటెంట్‌ ఉందంటే దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి, ఆయన ఆలోచనలే పునాదిగా వచ్చిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి, ఆయన ఆలోచనలే విధానాలుగా మార్చుకున్న మా నాయకుడు, సీఎం జగన్‌ కే.
 
టీడీపీ పేటెంట్లు ఏంటంటే ప్రపంచంలో లేని బెల్ట్‌షాప్ లు. మద్యాన్ని ఊరూరా విచ్చలవిడిగా అమ్మించి, ఎడాపెడా బెల్ట్‌షాప్‌లు పెట్టి డిక్షనరీలో లేని కొత్త మాట తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు. టీడీపీకి ఇలాంటి చెడ్డ కార్యక్రమాలకే పేటెంట్లు ఉన్నాయి.

- మా పేటెంట్‌ ఉచిత విద్యుత్, ఈ రోజు ఆ స్పూర్తికి విఘాతం కల్గించినా సహించే పరిస్ధితి ఉండదు. జగన్‌ శాశ్వత ప్రాతిపదికన ఈ పథకం భవిష్యత్తులోనూ బరువు కాకుండా ఒక సపోర్ట్‌ సిస్టమ్‌ డెవలప్‌చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా, రైతులకు ఇబ్బంది లేకుండా అవసరమైన భద్రతా, భరోసా ఏర్పాట్లు చేసే క్రమంలో ఇది పెద్ద అడుగు.
 
ఈ రోజు రైతుకు సంబంధించినంతవరకూ ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం, డిస్కంలకు బిల్లులు తర్వాత కడుతున్నాం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలోపు టీడీపీ ప్రభుత్వం రూ.8,000 కోట్ల బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం తీర్చింది. అలాగే నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని డెడికేటెడ్‌ ఫీడర్లు కావాలని రూ. 1,700 కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పూర్తిచేశాం.
 
కుటుంబ పెద్దలా జగన్‌ ప్రతీ స్కీంకు సపోర్టింగ్‌గా రెవెన్యూ సోర్స్‌ కలుపుతూ దీర్ఘకాలిక ప్రాతిపదికన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు, వచ్చే 30, 35 ఏళ్ళు ఇబ్బంది లేకుండా లాంగ్‌టర్మ్‌ ప్లాన్‌ సోలార్‌ పవర్‌ 10, 000 మెగావాట్లు డెడికేటెడ్‌గా తక్కువ ఖర్చుతో రైతులను శాశ్వతంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

- శాశ్వతంగా రైతు తన హక్కుగా, ఉచిత విద్యుత్‌ విషయంలో కచ్చితమైన హక్కుగా పొందే విధంగా జగన్‌ ఫౌండేషన్‌ వేశారు. దుష్రచారాన్ని ఎవరూ నమ్మద్దు, ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైతును అన్ని విధాలుగా ఆదుకోవాలనే విషయంలో జగన్‌ వెనకడుగు వేయరు. డిసెంబర్‌లో శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మొదలవుతుంది. విజ్ఞులైన ప్రజలంతా ఆలోచించాలి.
 
మా పార్టీ ప్లీనరీ 2017లో జరిగినప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించిన బకాయిలు నగదు రూపంలో వారికే ఇస్తామని ప్రకటించారు, ఎన్నికల సమయానికి అది మరింత పెరిగినా ఎలాంటి ఆలోచనా లేకుండా విడతల వారీగా మహిళలకే నేరుగా ఇవ్వాలని నిర్ణయించారు. రేషన్‌కార్డులు, పెన్షన్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌.. ఇలా ఏ పథకమైనా అర్హులయితే చాలు, అందరికీ ఇస్తున్నారు, అభివృద్దిని, సంక్షేమాన్ని వ్యవస్ధీకృతం చేసి కంకణం కట్టుకుని జగన్‌ ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు అప్పులు కుప్ప పెట్టి వెళితే.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.
 
టీడీపీ నేతలు ఎడాపెడా అప్పులు చేసి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు, 2014లో రాష్ట్రం విడిపోయే సరికి రూ. 90, 000 కోట్ల అప్పును, చంద్రబాబు దిగిపోయేసరికి రూ.2,58,000 కోట్లకు పెంచారు, మరో రూ. 40,000 కోట్లు పెండింగ్‌ బిల్స్‌ పెట్టారు. ఇంకో రూ. 60, 000 కోట్లు కార్పొరేషన్‌ల ద్వారా లోన్స్‌ తెచ్చుకున్నారు. 
 
టీడీపీ అనధికార, అధికార పత్రిక ఈనాడులోనే జగన్‌ ప్రమాణ స్వీకారం చేసే రోజుకు ఖజానాలో మిగిలింది రూ. 100 కోట్లే, మరి జీతాలు ఎలా ఇస్తారన్నారు, అలాంటి పరిస్ధితి నుంచి జగన్‌ ఇప్పటివరకూ ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పరిధి దాటకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. 

కేంద్రం గత సంవత్సరంలోనే ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటింది, కోవిడ్‌ తాకిడి ఉన్నా.. విద్యుత్‌ బకాయిలు కట్టాం. ఈ ఏడాదిన్నర కాలంలో పలు సంక్షేమ పథకాల ద్వారా రూ. 59,000 కోట్లు డైరెక్ట్‌గా లబ్దిదారులకు ఇచ్చాం, ప్రతీ పైసా జాగ్రత్తగా ఖర్చుపెట్టడం వల్లే ఇది సాధ్యమైంది.
 
గతంలోని టీడీపీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, 2024 వచ్చే సరికి ఎవరితో జట్టుకట్టాలని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటూ, చంద్రబాబు, టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
 
చంద్రబాబు విశాఖ గ్యాస్‌ లీక్‌ పై రాద్దాంతం చేసి, వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళకుండా, తర్వాత రమేష్‌ హస్పిటల్‌లో 10 మంది విలువైన ప్రాణాలు పోయినా మాట్లాడకుండా.. అవినీతిలో డెరెక్ట్‌గా దొరికిన కేసులో అరెస్టు అయిన అచ్చెన్నాయుడుని, మర్డర్‌ కేసులో ఉన్న కొల్లు రవీంద్రను పరామర్శించడానికి వచ్చారంటే.. ప్రజలను ఆయన గంతలు కట్టిన గుర్రాల్లా చూస్తారు తప్పితే.. ప్రజలకు ఆలోచించే శక్తి లేదన్నది చంద్రబాబు గుడ్డి నమ్మకం" అని పేర్కొన్నారు.