సంబంధిత వార్తలు
అప్పన్న దేవస్థానం అభివృద్ధికి సహకారం
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు బృందం పేర్కొంది. శుక్రవారం ప్రత్యేక ఆహ్వానితులు మేడిద మురళీ కృష్ణ, దశమంతుల మాణిక్యాలరావు, యండమూరి వెంకట్రావు గంట్ల శ్రీను బాబు, తదితరులు వరాహ పుష్కరిణి సందర్శించారు.
వరహా పుష్కరనీ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని తాము ఇప్పటికే ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించినట్లు శ్రీనుబాబు చెప్పారు. వరాహ పుష్కరిణి ప్రాంతం అభివృద్ధి చేస్తే, భక్తులకి ఆహ్లాదకరమైన వాతావరణం కలుగుతుందని, అంతే కాకుండా సాయంత్రం పూట గ్రామ ప్రజలు కూడా ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇక అడవివరం స్మశానానికి వెళ్లే రహదారిని కూడా మెరుగుపరచవలసిన అవసరం ఉందని, నాలుగు వైపులా రహదారులు అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం సుందరంగా విరాజిల్లుతోంది అన్నారు.
ఆదివారం నాటి పోలి పాడ్యమి సందర్భంగా సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా ఉన్నాయని కొనియాడారు. పుష్కరిణిలో నాచు పట్టిన పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఇక్కడ పేరుకుపోయిన కొంత చెత్తా చెదారాన్ని వీరు క్లీన్ అండ్ గ్రీన్ ద్వారా తొలగించారు. తదుపరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ భక్తులను లోటుపాట్లు అడిగి తెలుసుకున్నారు.
అక్కడ కైంకర్యపరుడికి సక్రమంగా జీతం చెల్లిస్తున్నందుకు ఈవో సూర్యకళకి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో జీతం లేకపోవడం వల్ల తాము ఈ విషయాన్ని ఈఓ దృష్టికి తీసుకు వెళ్ళడంతో సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దాతల సహకారంతో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ధనుర్మాసం నాటికి వేంకటేశ్వర స్వామి ఆలయం లో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
