1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Skill Development Case : Chandrababu Bail Petition Orguments

అవినీతి జరిగినట్టు ఒక్క ఆధారం చూపించలేదు : చంద్రబాబు న్యాయవాది దూబే

chandrababu naidu
స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాట్లులో అవినీతి జరిగినట్టు ఆరోపిస్తున్న సీఐడీ అధికారులు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు చూపించలేకపోయారని టీడీపీ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే అన్నారు. 
 
ఈ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ, అవినీతి చేసినట్లు ఆధారాలు చూపించలేకపోయారని కోర్టుకు తెలిపారు. 
 
'స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారు. డిజైన్‌ టెక్‌ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటుచేశారు. 
 
వీటి ద్వారా 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది? చంద్రబాబు పాత్ర ఏముంది? ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలి' అని కోర్టును కోరారు.  
 
సీఐడీ తరపున ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తూ, 'ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదు. ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యుడు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌ చంద్రబాబుకు అప్లై అవుతుంది. కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
ఉపాధ్యాయురాలిపై అత్యాచారం.. గ్రేటర్ నోయిడాలో ఘోరం..