1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 అక్టోబరు 2019 (07:16 IST)

త్వరలో రెడ్ క్రాస్ శ‌తాబ్ధి ఉత్స‌వాలు.. గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి స్వచ్చంధ ప్రాతిపదికన 2018-19 సంవత్సరంలో 82 వేల 055 యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైనవారికి నాణ్యమైన రక్తాన్ని సరఫరా చేసిందని రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.

విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు పంక్ష‌న్ హాల్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన 2018-19 సంవత్సర బంగారు పతకాలు, సేవా, ఇతర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ ఉద్యమం మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వాతంత్యం, స్వచ్ఛంధ సేవా, ఐక్యత మరియు విశ్వవ్యాప్తత యొక్క ఏడు ప్రాధమిక సూత్రాలపై 1920లో పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిందన్నారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఉనికిలో వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్నామన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ షార్ట్ ఫిల్మ్ పోటీని నిర్వహిస్తున్నదని ఇందుకోసం 450కు పైగా ఎంట్రీలు అందాయన్నారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ ఉద్యమానికి తమ విలువైన సేవలను అందించిన వాలంటీర్లు, ఏజెన్సీలకు అవార్డులు ప్రధానం చేయడం సంతోషకరంగా ఉందన్నారు.

రెడ్‌క్రాస్ సొసైటీ చేసే కార్యక్రమాలకు అత్యుత్తమ సహకారాన్ని అందించిన అవార్డు గ్రహీతలను, బంగారుపతకాలు, ధృవపత్రాలు పొందినవారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రెడ్ క్రాస్ యొక్క లక్ష్యం స్వచ్ఛంద సేవకుల యొక్క శక్తిని, దాతల ఔదార్యాన్ని సమీకరించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో మానవ బాధలను నివారించడం, తగ్గించడమేనని ఆయన అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఏలూరులో ప్రత్యేక తల సేమియా, సికిల్ సెల్, హిమోఫిలియా, ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ ను ఏర్పాటుచేసి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందించడం సంతోషకరం అన్నారు. 2018-19 లో నెల్లూరులోని క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా 475 సర్జరీలు, 457 మందికి రేడియోథెరఫీ, 2272 మందికి కెమోథెరఫీ, 4883 మందికి వైద్య సేవాచికిత్సలు క్రింద సేవలు అందించడం జరిగిందన్నారు.

కృష్ణా, అనంతపురం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో బ్లడ్ బ్యాంక్ లు అప్గ్రేడ్ చేసేందుకు రూ. 1.39 కోట్ల రూపాయలు పొందాయన్నారు. ఏలూరులోని తల సేమియా, ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్, ప్రధమ చికిత్సా శిక్షణా కార్యక్రమంలో 3 వేల 890 మందికి, ప్రాధమిక చికిత్సలో 1193 మందికి వృత్తిపరమైన ప్రధమ చికిత్సల శిక్షణ అందించడం జరిగిందన్నారు.

విపత్తు నిర్వాహణారంగంలో 161 శిక్షణా కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో 7 వేల 661 మంది వాలంటీర్లకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ, రెస్క్యూ, సహాయ చర్యలు వంటి విపత్తు నిర్వాహణా కార్యకలాపాల్లో శిక్షణ అందించబడిందన్నారు.

శిక్షణ పొందిన యస్ఇఆర్ వి వాలంటీర్లు 21 మంది ప్రాణాలను కాపాడినందున శ్రీకాకుళం జిల్లాలో ఆకార్యక్రమం చాలా విజయవంతం అయ్యిందన్నారు. ఈకార్యక్రమం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భారతదేశంలో వందసంవత్సరాల రెడ్ క్రాస్ వేడుకల్లో భాగంగా ఈ 100 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడడం మరియు ముందుకు సాగడం ” అనే అంశంతో వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.

కృష్ణా, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలు ఉత్తమ జిల్లా బ్రాంచి పురస్కారాలు అందుకున్నందుకు ఆయా జిల్లా కలెక్టర్లను గవర్నరు ప్రత్యేకంగా అభినందించారు. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ఆరు జిల్లాల్లో పదివేల ఐదువందల ఒక్క మంది రోగులకు మెగా క్యాంపులు నిర్వహించామన్నారు.

ఈ శిబిరాల్లో పదివందల యాభై ఒక్క కేసులను రిఫరల్, ఫాలో అప్ కోసం పంపించడం సంతోషకరం అయ్యిందన్నారు. సేవాస్పూర్తిని పెంపొందించడానికి క్యాంపస్లో పరిశుభ్రత, గ్రీన్ కవర్, ఇంధన మరియు నీటిపరిరక్షణ, వ్యర్థ పదార్థాల నిర్వాహణ, సామాజిక ఆందోళన పై అవగాహన క్రింద పతకాలు ప్రధానం చేయడానికి జూనియర్, యూత్ రెడ్ క్రాస్ స్టేట్ అవార్డులను కూడా రాష్ట్ర శాఖ ప్రవేశ పెట్టిందన్నారు.

ఈ ప్రాంతంలోని ఉత్తమ సంస్థలు, నోడల్ అధికారులు, వాలంటీర్లు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు కోసం స్పోర్ట్స్ మీట్ లో డ్రగ్స్ మరియు ఆల్కాహాల్ నో చెప్పండి ” అనే నినాదంతో జిల్లా శాఖల్లో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి ఉత్తమ జిల్లా అవార్డుల సంస్థ, వాలంటీర్ డేటాబేస్, బ్లడ్ బ్యాంక్ డేటాబేస్, సభ్యత్వంకోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వంటి అంశాలను కవర్ చేస్ సమగ్ర వెబ్ సైట్ ప్రారంభించబడిందన్నారు.

ఈసందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 130 మందికి బంగారుపతకాలు, ఇతర ప్రశంసాపత్రాలు, తదితరాలు, అవార్డులను రాష్ట్రగవర్నరు విశ్వభూషణ్ హరిచందన్ అందజేయగా వాటిలో ఐఏయస్ అధికారులు అయిన యంటి.కృష్ణబాబు, ఏయండి. ఇంతియాజ్, కార్తి కేయమిశ్రా, యస్. సత్యనారాయణ, డా. యం. హరిజవహర్ లాల్, వి.ప్రసన్న వెంకటేష్, జె.నివాస్, సి.నాగరాణి, తదితరులకు బంగారుపతకాలను రాష్ట్రగవర్నరు అంద జేసారు.

రెడ్ క్రాస్ కార్యకలాపాల్లో ఓవర్ ఆల్లో ప్రతిభ చూపిన తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల బ్రాంచీలు ప్రధమ, ద్వితీయ, తృతీయ అవార్డుల క్రింద గవర్నరు షీల్డ్ ను అందజేశారు.

కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్ పర్సన్ రేచర్ల చటర్జీ, రెడ్ క్రాస్ సొసైటీ ఏపి స్టేట్ బ్రాంచి జనరల్ సెక్రటరి యస్.బాలసుబ్రహ్మణ్యం, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రసిడెంట్ ముఖేష్‌కుమార్ మీనా, జిల్లా కలెక్టరు ఏయండి ఇంతియాజ్, ఐఏయస్ అధికారులు యంటి.కృష్ణబాబు, కార్తికేయ మిశ్రా, యస్.సత్యనారాయణ, డాక్ట‌ర్ యం.హరిజవహర్ లాల్, వి.ప్రసన్న వెంకటేష్, జె.నివాస్, సి.నాగరాణి, తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశా నిర్వ‌హించారు.