శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (15:19 IST)

వంటా వార్పుకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. అరెస్టు

nimmala ramanaidu
ఏపీలో నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఉన్న టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. అలాగే, నిజం చెపుతాం అంటూ వైకాపా నేతలు ప్రతి నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుని అరెస్టు చేశారు. 
 
బుధవారం 'పాలకొల్లు చూడు' పేరుతో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంజార్జ్ గొదాల గోపి కూడా 'నిజం చెబుతాం' పేరుతో కార్యక్రమం చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాల నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులోభాగంగా, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడును గృహ నిర్భంధం చేశారు. అయితే, పోలీసుల కన్నుగప్పి ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. 
 
ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఎమ్మెల్యే కింద పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనను భీమవరం వైపు తీసుకెళ్లారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు. కానీ, అధికార వైకాపా నేతలను పోలీసులు కనీసం ముట్టుకోకపోవడంగమనార్హం.