శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:29 IST)

కరోనా ఎఫెక్టు : తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ వాయిదా

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతోంది. గతవారంలో ఈ వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గింది. కానీ, గత రెండు రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో వచ్చే నె 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2020 పరీక్షలను వాయిదావేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగించింది. దీంతో ఎంసెట్‌ను వాయిదావేసినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 
 
మే నెలలో నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ (ఫార్మసీ, వెటర్నరీ.. ఇతర) కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఎంసెట్‌), ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌), ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌), లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (లాసెట్‌), ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌), పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) వంటి అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో ఈ పరీక్షల దరఖాస్తుల గడువు తేదీని కూడా మే ఐదు వరకు పొడిగించినట్టు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని కోరారు. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయినవారు ఇపుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.