బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (18:30 IST)

జోన్లుగా దేశ విభజన : గ్రీన్ జోన్‌లో లాక్‌డౌన్ ఎత్తివేత?!

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఇది ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్నదే ఇపుడు కోట్లాది మంది ప్రజలకు సందేహాంగా ఉంది. అయితే, పెక్కు రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. మొగ్గుచూపుతున్నాయి కూడా. దీంతో కేంద్రం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, ఇందుకోసం ఓ నిర్ధిష్ణ ప్రణాళకను రచించి, దాన్ని పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇందులోభాగంగా దేశాన్ని మూడు జోన్లుగా విభజించనున్నట్టు సమాచారం. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు ఉంటాయట. 
 
ఇందులో గ్రీన్ జోన్ అంటే, ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్‌లో చేర్చుతారు. ఈ జోనులో లాక్‌డౌన్ పూర్తిగా సడలించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ఒక్క కొవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్‌జోన్‌లో చేర్చనున్నారు.
 
ఇక ఆరెంజ్ జోన్ విషయానికొస్తే.... 15 కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండి, పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేని జిల్లాలను ఆరెంజ్ జోన్‌గా పరిగణించే అవకాశం ఉంది. ఈ ఆరెంజ్ జోన్ జిల్లాల్లో పరిమిత స్థాయిలో ప్రజారవాణా, వ్యవసాయపనులు, ఇతర నిత్యావసర కార్యకలాపాలకు అనుమతిస్తారు.
 
చివరగా రెడ్ జోన్.. 15 కేసుల కంటే మించి నమోదైన ఏ ప్రాంతాన్నైనా రెడ్ జోన్‌గా పరిగణిస్తారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలైనా నిషిద్ధం. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తారు. అయితే, ఈ విషయాన్ని లాక్‌డౌన్ గడువు ముగిసేలోపు ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించి, ఈ జోన్ల విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
 
కాగా, దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 8731 కేసులు నమోదయ్యాయి. అలాగే, 295 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 845 మంది ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు.