బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ఐదు నెలల్లో రాష్ట్రాన్ని ముంచేశారు: లోకేష్

ఆరు నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటానన్న జగన్.. 5 నెలల్లో రాష్ట్రాన్నే ముంచేశారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

భవన నిర్మాణ కార్మికులకు తిండి లేకుండా చేసి వైసీపీ నేతలు ఇసుక తింటున్నారని ఆరోపించారు. ఇసుక కోసం ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ఒక మాయ అని, అందులో సామాన్యులకు ఎప్పుడూ నో స్టాక్ అనే వస్తుందంటూ ఫైర్ అయ్యారు. వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడింది అని మంత్రులు చెబుతున్నారని.. మరి రాష్ట్రంలో దొరకని ఇసుక బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ఎలా వెళ్తోందని నిలదీశారు.

గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఇసుకను ఏ పందికొక్కు తింటుంది? అని తీవ్రస్థాయిలో లోకేశ్‌ ప్రశ్నించారు.

నష్టపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి నెలకు రూ.10 వేలు చొప్పున ఈ ఐదు నెలలకు వెంటనే రూ.50 వేలు చెల్లించాలని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని, తిరిగి ఉచిత ఇసుక విధానం తీసకురావాలని డిమాండ్‌ చేశారు.

కాగా, నెల్లూరు జిల్లాలో భవన నిర్మాణ కూలీలు వినూత్న నిరసన తెలిపారు. సీఐటీయు ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్టాండు వద్ద వారు రూ.50కు త్రాసులో ఇసుకను కొలిచి, విక్రయిస్తూ అందరినీ ఆకర్షించారు. వీరికి సంఘీభావంగా టీడీపీ నాయకులు నెల్లూరులో ఒక రోజు నిరాహార దీక్ష చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో ‘ఇసుక’ ఆందోళన ఊపందుకొంది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆమె తక్కెడలో ఇసుక తూచి అమ్ముతూ నిరసన తెలిపారు. అక్కడే బాధిత కార్మికులు వైసీపీ జెండాలతో కూడిన ఉరికంబాలు ఎక్కి.. నిరసన తెలిపారు.

కాగా, ఇసుక కొరత కారణంగా పనులు దొరక్క గుంటూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.