శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (15:50 IST)

ఘనంగా శ్రీ గోదాకల్యాణం.. ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు

పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగింది. ధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 141 కేంద్రాల్లో నెల రోజుల పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు. 
 
ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి(ఆండాళ్‌), శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం  శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. 

వేద పారాయణదారుల వేద పఠనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది. అనంత‌రం తిరుప‌తికి చెందిన కుమారి ఎం.భానుజ బృందం గోదాదేవిపైన నృత్య‌రూప‌కాన్ని చ‌క్క‌గా ప్ర‌ద‌ర్శించారు.
 
అన్నమాచార్య కళామందిరంలో ముగిసిన తిరుప్పావై ప్రవచనాలు
టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధ‌వారం ముగిశాయి. తిరుపతికి చెందిన చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై  ప్రవచనాలు వినిపించారు. 
 
ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఆఏ అండ్ సిఏవో ఓ.బాలాజి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఇన్ చార్జి ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, భక్తులు పాల్గొన్నారు.