సోమవారం, 15 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 నవంబరు 2025 (18:01 IST)

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

hidma
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం వేకువజామున భద్రతా బలగాలు - మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధించిన డెడ్‌లైన్‌ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. నవంబరు 30వ తేదీలోపు హిడ్మా ఆటకట్టించాలని భద్రతా బలగాలను అమిత్‌షా ఆదేశించినట్లు సమాచారం.
 
'2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్‌ షా గడువు విధించారు. ఈ క్రమంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో నవంబరు 30వ తేదీలోగా హిడ్మా పనిపట్టాలని భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ డెడ్‌లైన్‌ కన్నా ముందుగానే ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మా మృతిచెందడం గమనార్హం' అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్‌ను చూస్తుంటే దేశంలో నక్సలిజాన్ని మార్చి కంటే ముందుగానే తుడిచివేసేలా కనిపిస్తున్నారు. 
 
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారని గతంలో అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. హింసను, ఆయుధాలను వదిలేసి వారు లొంగిపోవాలని లేకపోతే మావోయిస్టుల అంతానికి ఆల్‌ - అవుట్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.