మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (09:16 IST)

టిటీడీ ఈవో బదిలీ

తిరుమల‌ తిరుపతి దేవస్థానం ఈవో ‘అనిల్‌కుమార్‌ సింఘాల్‌’ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘అనిల్‌కుమార్‌’ స్థానంలో ఇంఛార్జి ఈవోగా ‘ధర్మారెడ్డి’ని నియమించింది.

‘సింఘాల్‌’ను వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ‘జవహర్‌రెడ్డి’ని తిరుమల‌ తిరుపతి దేవస్థానం ఈవోగా నియమిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. టిటీడీ ఈవోగా పనిచేయాల‌ని చాలా కాలం నుంచి ‘జవహర్‌రెడ్డి’ ఆశిస్తున్నారనే ప్రచారం ఉంది.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈవోగా నియమితులైన ‘అనిల్‌కుమార్‌’ను వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఈవోగానే కొనసాగించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దల‌ అండ ఉండడంతోనే ఆయన ఆ పోస్టులో కొనసాగారనే మాట అధికార వర్గాల‌ నుంచి వచ్చింది.

వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే క్రియాశీల‌క పదవుల్లో ఉన్న ఐఎఎస్‌ అధికారుల‌నందరినీ సాగనంపింది. వారిలో కొందరికి ఏళ్ల తరబడి పోస్టింగ్‌లు ఇవ్వకుండా అట్టిపెట్టింది. దాదాపు ఏడాదిన్నర తరువాత కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చింది.

టిడిపి హయాంలో ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారిలో చాలా మందికి ఇదే అనుభవం ఎదురైనా ‘అనిల్‌కుమార్‌’ సింఘాల్‌ మాత్రం టీటీడీ ఈవోగానే కొనసాగారు. బిజెపి పెద్దలు, ముఖ్యులు ఆయన వెనుక ఉండడంతో ఆయనను కదిలించలేదనే అభిప్రాయం ఉంది.

అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ..హఠాత్తుగా ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతానికి ఇన్‌ఛార్జిగా ‘ధర్మారెడ్డి’ని నియమించినా..పూర్తి కాల‌పు ఈవో ‘జవహర్‌రెడ్డి’ని నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.