1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayawada - Hyderabad Intercity express from today

నేటి నుంచి విజయవాడ - హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌

Vijayawada
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌.. ఏపీలోని ప్రధాన నగరం విజయవాడ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు శుభవార్త! లింగంపల్లి - విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించారు. 9వ తేదీన ఈ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది. 10వ తేదీన లింగంపల్లి నుంచి ఈ రైలు బయలుదేరుతుంది.

తర్వాత ప్రతి రోజూ ఉదయం లింగంపల్లి నుంచి విజయవాడకు, సాయంత్రం విజయవాడ నుంచి లింగంపల్లికి ప్రయాణం సాగిస్తుంది. లింగంపల్లి నుంచి 02796 నంబరుతో ఈ రైలు ప్రతి రోజూ వేకువజామున 4.40 గంటలకు బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌కు ఉదయం 5.20 గంటలకు చేరుకుని.. 5.30కి తిరిగి బయలుదేరుతుంది.

ఉదయం 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ నుంచి 02795 నంబరుతో ఈ రైలు ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి.. సికింద్రాబాద్‌కు రాత్రి 10.15 గంటలకు చేరుకుని తిరిగి 10.20 గంటలకు బయలుదేరి లింగంపల్లికి 11.20 గంటలకు చేరుకుంటుంది.

ఏసీ చైర్‌కార్‌తో పాటు నాన్‌ ఏసీలో కూర్చొనే వెసులుబాటు ఉంది. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్‌ చేసిన తర్వాత రైలు బయలుదేరుతుంది. మొత్తం సీట్లన్నింటికీ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. రిజర్వేషన్‌ ఉన్నవారినే అనుమతిస్తారు.

1 నుంచి దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ సమయంలో మార్పు
హైదరాబాద్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ల మధ్య ప్రతిరోజు నడుస్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌(నంబరు.02721/02722) ప్రత్యేక రైలు రాకపోకల సమయాలు జనవరి 1వ తేదీ నుంచి మారుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రైలు హైదరాబాద్‌ నుంచి రాత్రి 10.30కి బదులుగా రాత్రి 11 గంటలకు బయల్దేరుతుంది.

హజ్రత్‌ నిజాముద్దీన్‌(దిల్లీ) స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.05 గంటలకు బదులుగా 3.40కి చేరుకుంటుంది. హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ నుంచి రాత్రి 11 గంటలకు బదులు 10.50కి బయల్దేరి హైదరాబాద్‌ స్టేషన్‌కు రెండోరోజు తెల్లవారుజామున 4.45కి బదులు 3.40కి చేరుకుంటుంది.
తర్వాతి కథనం
భారత రైతులకు అమెరికా నేతల ప్రశంస