శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:18 IST)

రాజధానిగా విశాఖ... త్వరలోనే నిర్ణయం: విజయసాయి కీలక ప్రకటన

వైసీపీ ఎంపీ, కీలకనేత విజయసాయిరెడ్డి నవ్యాంధ్ర రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. అమరావతి నుంచి రాజధాని మార్చొద్దని రైతులు, ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు.. కరోనా వైరస్ నేపథ్యంలోనూ ఇప్పటికీ రాజధాని ప్రాంత రైతులు, కూలీలు వారి ఇళ్ల ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ కీలక నేత విజయసాయి కీలక ప్రకటన చేశారు.

‘విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుంది’ అని ప్రకటించారు. మంగళవారం నాడు విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు.

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఈ క్రమంలో రాజధాని ప్రస్తావన తెచ్చిన విజయసాయి పై విధంగా ప్రకటన చేశారు.