1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (16:28 IST)

మీకిది తగునా?... రోజాపై విమర్శల వెల్లువ!... ఎందుకో తెలుసా?

చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు.
 
పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి  రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెపై పూలు చల్లుతుండగా, ఆమె ముందుకు కదిలారు. ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కలిసి వెళ్లారు.
 
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబడుతున్నారు. రోజా తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు.
 
బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా?
టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా పర్యటనకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అనిత.. రోజా తీరుపై మండిపడ్డారు. ఆ వీడియోలో కొందరు రోజాకు స్వాగతం పలుకుతూ ఆమెపై బంతిపూలు చల్లుతున్నారు.

దీనిని అనిత తీవ్రంగా తప్పుపట్టారు. ‘మనం రాజరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం గత పది నెలలుగా నన్ను తొలుస్తుంది. కానీ మనం రాజరికంలో ఉన్నామని ఖచ్చితమైన కన్ఫర్మేషన్‌ను రోజా రెడ్డి ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

‘కరోనా విజృంభిస్తున్న వేళ పక్కపక్కనే నిలబడి బంతిపూలు చల్లటం ఏంటి రోజా రెడ్డి గారూ..? బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా?’ అని ప్రశ్నించారు. బ్లీచింగ్ ఫౌడర్, పారాసిటమాల్ తర్వాత మీ కౌరవ సైన్యం(వైసీపీ నేతలు) కనిపెట్టిన కొత్త మందు బంతిపూలా? రోజా గారూ అని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు.