గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (16:28 IST)

భార్యాభర్తల తగాదా: కౌన్సిలింగ్ ఇస్తుండగానే బయటకెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ

suicide
జిల్లా కేంద్రమైన విశాఖపట్టణంలోని ఎంవీపీ కాలనీలోని పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ వివాహిత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఈ ఘటన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన శ్రావణి(30)కి విశాఖకు చెందిన వినయ్‌తో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో శ్రావణి బుధవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం ఉదయం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు.
 
దంపతులకు ఎస్ఐ శ్రీనివాస్‌ కౌన్సెలింగ్‌ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు యత్నించారు. 
 
మంటలను ఆర్పే క్రమంలో ఎస్ఐ శ్రీనివాస్‌ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ ఆమె మృతిచెందింది.
 
దీంతో పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీసీపీ సుమిత్‌ సునీల్, ఏసీపీ మూర్తి, సీఐ ప్రసాద్‌లు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.