1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (08:41 IST)

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడిన గుంటూరు టెక్కీ మృతి

srinath
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి మృతి చెందాడు. ఆదివారం కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ పర్వతారోహణకు వెళ్లాడు. ఈ మౌంటెన్ హిల్స్‌పై ట్రెక్కింగ్ చేస్తుండగా, 200 అడుగుల ఎత్తు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుంటూరుకు చెందిన శ్రీనాథ్ (32) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో టెక్కీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన ఆదివారం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌కు తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్ళాడు. ఆయన పర్వతాన్ని ఎక్కుతుండగా 200 అడుగుల ఎత్తు నుంచి జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
కాగా, గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు - రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణితో, రాజేంద్ర నగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. ఈ భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.
 
గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఇటీవల అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ట్రెక్కింగ్ కోసం క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌‌కు వెళ్లి మృత్యువాతపడ్డారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.