1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (18:17 IST)

14 నెలల్లో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగింది?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైందని, ఈ 14 నెలల్లో విద్యుత్ బిల్లులు 3 రెట్లు పెంచారని, పెట్రోలు డీజిల్ ధరలు 3 సార్లు పెంచారని, ఆర్టీసి ఛార్జీలు పెంచారని మద్యం ధరలు 300 శాతం పెంచారని ఇంతకంటే రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ ప్రశ్నించారు.

14 నెలల పాలనలో అన్ని రంగాల్లో వైసిపి ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు సంక్షేమ పధకాల పేరుతో ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో లాక్కుంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తే, ప్రస్తుతం జగన్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందన్నారు.

రాష్ట్రంలో మద్యం బహిరంగంగా అమ్ముతుంటే, సరుకులు, టీ దొంగచాటుగా అమ్మే పరిస్థితి వచ్చిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి టిడిపి నాయుకులను, కార్యకర్తలను జైళ్ళకు పంపుతున్నారన్నారు.

గతంలో ఏ పార్టీ అయినా కులం గురించి మాట్లాడిందా ? ప్రతిదానికి కులం తెస్తున్నారని, చివరకు ఎన్నికల ప్రధానాధికారికి కూడా కులం అంటగడుతున్నారని, గతంలో టిడిపి సామాజిక న్యాయం చేస్తే ప్రస్తుతం వైసిపి విచ్ఛిన్నం చేస్తుందన్నారు.

నాడు అభివృద్ధిలో దూసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్, నేడు కరోనా కేసుల్లో దూసుకెల్తోందని దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన అసమర్ధత, అనుభవారాహిత్యం, అహంకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు.