1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:16 IST)

పరీక్షలు నిర్వహించని డిగ్రీలను గుర్తించం: యూజీసీ

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ, చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని.. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది.

అలా కాని పక్షంలో సదరు డిగ్రీలను గుర్తించబోమని కూడా హెచ్చరించింది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సర విద్యార్థులకు సెప్టెంబరు 30 లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.
 
కాగా, కొవిడ్‌-19 నేపథ్యంలో చివరి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేయాలని దిల్లీ, మహారాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు సుప్రీం వద్ద అఫిడవిట్‌ను దాఖలు చేశాయి.

అంతేకాకుండా, కమిషన్‌ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై విచారణను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  చేపట్టింది.
 
ఈ నేపథ్యంలో, పరీక్షలను రద్దు చేయటం విద్యార్థులకు మేలు చేయదని యూజీసీ తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి నేడు విన్నవించారు. కాగా, కమిషన్‌ నిర్ణయం రాజ్యాంగం, చట్టానికి అనుగుణంగా లేదని ఆయా విశ్వవిద్యాలయాలు వాదించాయి.

ఈ అంశంపై ప్రత్యుత్తరమిచ్చేందుకు కమిషన్‌కు వ్యవధినివ్వాల్సిందిగా తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ఇందుకు సమ్మతించిన సర్వోన్నత న్యాయస్థానం, కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.