శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2020 (09:31 IST)

కమ్మవారిపై జగన్ కు ఎందుకంత ద్వేషం?

కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి వచ్చి, 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, 6సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను రాష్ట్రంలోని పాలకులు అనుసరిస్తున్న కులవిధానాలను చూసి బాధపడుతున్నానని  టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వాపోయారు.

ఆయన తన నివాసంనుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. గతంలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి వంటివారి నాయకత్వాల్లో కమ్మవారు పనిచేశారన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే కమ్మవారు రాష్ట్రంతో పాటు, ఇతరరాష్ట్రాల్లో వ్యాపారాలు ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారన్నారు.

జమీందార్లుగా ఉన్నప్పటికీ, దాన్ని కాదని, పేదలకు భూపంపిణీచేసింది, రజాకార్ల ఉద్యమంలో తెలంగాణలో బలైన బాధితులకు అండగా నిలిచింది కమ్మజాతేనన్నారు.   ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే కమ్మవర్గీయులు అనేక రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదిగారన్నారు.

జలగం వెంగళరావు, బ్రహ్మనందరెడ్డి వంటివారు వర్గాలకు అతీతంగా అందరినీ ప్రోత్సహించారని బుచ్చయ్య చెప్పారు. అలాంటి పరిస్థితులకు విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింతలా ఒక కులంపై, ఆ వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, అధికారులు, కాంట్రాక్టర్లు, నేతలపై కక్షతో వ్యవహరిస్తోందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.

రాష్ట్రంలో కులపిచ్చ పరాకాష్టకు చేరిందన్న బుచ్చయ్యచౌదరి, ప్రతిశాఖను తనవర్గంవారితో, బంధువులతో  నింపేసింది ఈ ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నించారు.  కమ్మవారిపై ద్వేషంతో తనకు తెలియకుండానే  ఈ ముఖ్యమంత్రి ఇతరవర్గాలవారికి కూడా చేటు చేస్తున్నాడన్నారు.

అణగదొక్కబడిన వారు, ఎల్లకాలం అలానే ఉంటారని అనుకోవద్దని ఆయన సుతిమెత్తగా హెచ్చరించారు. కమ్మవారు ఈ  ప్రభుత్వంలో ఎందుకు అంటరాని వారుగా ఉండాలో, కమ్మజాతి ఏంచేసిందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు? చంద్రబాబు పై ద్వేషముంటే, ఆయనతోనే తేల్చుకోవాలని, అలాకాకుండా వర్గం మొత్తంపై కక్ష కట్టడమేంటని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

గతంలో 39మంది పోలీస్ అధికారులను డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే, వారిలో ముగ్గురు కమ్మవారుంటే, మొత్తం కమ్మవారికే ప్రమోషన్లు ఇచ్చారంటూ జగన్ గోబెల్స్ ప్రచారం చేశాడన్నారు. మరి ఇప్పుడు జగన్ 100మంది పోలీస్ అధికారులను ఎందుకు వీఆర్ లో పెట్టాడో చెప్పాలన్నారు.

తనజాతికి తాను న్యాయం చేసుకుంటే ఎవరూ కాదనరని, కీలకమైన శాఖల్లో తనవారిని నియమించుకుంటున్న జగన్, ఇతరవర్గాల వారివ్యాపారాలను, మైన్స్ ను కొల్లగొడుతున్నా డని టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో స్టాండింగ్ కౌన్సిల్ లో 100మందిలో 25మంది రెడ్లకు చంద్రబాబు అవకాశమిచ్చిన విషయాన్ని, ఈ ప్రభుత్వంలో 700పైచిలుకు పోస్టులను తనవర్గానికి కట్టబెట్టుకున్న జగన్ తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు పాలనలో కమ్మవారికి ఒరిగిందేమీ లేదన్న బుచ్చయ్య, ఆయన బడుగుబలహీనవర్గాలు, దళితులకే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. ఎటువంటి కులబలం లేకుండా 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను, నేడు కులంగురించి మాట్లాడటానికి జగన్ సాగిస్తున్న అరాచకాలు, అటవిక విధానాలే కారణమని బుచ్చయ్య స్పష్టంచేశారు. 

టీడీపీఎమ్మెల్యేలు, ఇతరులకు ఉన్న మైనింగ్ పరిశ్రమలను కొల్లగొడుతున్న జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, తన బంధువులైన బూచేపల్లి శివప్రసాదరెడ్డికున్న మైనింగ్ లను ఎందుకు వదిలేశాడో చెప్పాలని చౌదరి డిమాండ్ చేశారు.  కమ్మవారి మైన్స్ పై దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకుంటున్నారన్నారు.

గొట్టిపాటి రవికుమార్, గరికపాటి రామ్మోహన్ రావు, పోతుల రామారావుల ను టార్గెట్ చేశారన్నారు. కులతత్వంతో పనచేయడానికే వైసీపీ అధికారంలోకి వచ్చినట్లుగా ఉందన్నారు. గతంలో విజయవాడలో  రౌడీమూకల మధ్య జరిగిన గొడవను, రెండువర్గాల మధ్య గొడవగా చిత్రీకరించి వై.ఎస్. లబ్దిపొందాడన్నారు. 

ఏ జాతికి ఆ జాతి తమస్వార్థంకోసం పనిచేస్తే, జగన్ లాంటి వారు ఎక్కడ ఉండేవారో చెప్పాల్సిన పనిలేదన్నారు. జగన్ ఎందుకింతలా కమ్మద్వేషంతో పనిచేస్తున్నాడో చెప్పాలని, గోరంట్ల డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకో లో తనకున్న అనుభవంతో, ఒకవైపు నీతివాక్యాలు చెబుతూ, మరోవైపు దోపిడీ చేస్తున్నారన్నారు.

హైకోర్టులో పోస్టులను కూడా తనకులంవారితో నింపేప్రయత్నం చేస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై దాడిచేస్తూ, జడ్జీలకు కూడా కులాన్ని అంటగట్టే ప్రయత్నంచేయడం, ఐఏఎస్ అధికారులకు కూడా కులం అంటగట్టి పోస్టింగులు ఇవ్వకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని  పదవులు, సంపద మొత్తం తనవర్గానికే కట్టబెడుతూ, తప్పు చేయకపోయినా ఇతరవర్గాలపై  పడటమేంటన్నారు.

రమేశ్ బాబుకి కులం అంటగట్టి, రమేశ్ ఆసుపత్రి మూతపడేలా చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, కోవిడ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలున్నాయని ప్రభుత్వం చెప్పగలదా అని బుచ్చయ్య మండిపడ్డారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాల్సి వస్తుందనే, సీఆర్డీఏని రద్దు చేశారన్నారు.  గోదావరిలో పులివెందుల ముఠాలు డ్రెడ్జింగ్ పేరుతో దోపిడీ చేస్తుంటే, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

పోలీస్ వ్యవస్థని అడ్డుపెట్టుకొని, తప్పుడు కేసులు పెడుతూ, అరాచకం సృష్టిస్తున్నారని, పట్టపగలే విజయవాడ నగరాన్ని తగలేసే స్థితికి తీసుకొచ్చారన్నారు. దిశాచట్టంలో ఎంతమందికి న్యాయంచేశారో, చిత్తూరు జిల్లాలో దళిత యువకుడు ఎందుకుఆత్మహత్మ చేసుకున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు.  

తెలుగుదేశాన్ని అణగదొక్కడం కోసం తప్పుడు కేసులను నమ్ముకంటే, సాధించేదేమీ ఉండదనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు. జగన్ ప్రజలను నమ్మించి అధికారంలోకివచ్చి, రాష్ట్రాన్ని నట్టేట ముంచాడన్నారు. గతప్రభుత్వం అమలుచేసిన పథకాలను రద్దుచేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడన్నారు. 

ఉన్న పథకాలకు జగనన్న, వైఎస్సార్ పేర్లుపెట్టి, రంగులుమార్చినంత మాత్రాన అభివృద్ధి చేసినట్లు కాదన్నారు. ఒక కులంపై ద్వేషంతో అన్నివర్గాలకు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సాక్షి మీడియా సిబ్బందిని తెచ్చి, సలహాదారులుగా నియమించి, ప్రభుత్వసొమ్ముని జీతంగా ఇస్తున్నారని, వారేమి సలహాలిస్తున్నారో, సిగ్గులేకుండా కోర్టులతో 70సార్లు ఎందుకు మొట్టికాయలు తిన్నారో  చెప్పాలన్నారు. 

కులద్వేషంతో ముందుకెళ్లే వారంతా ఎప్పటికైనా నష్టపోవాల్సి వస్తుందని, చారిత్రక నగరమైన అమరావతిపై కూడా కులముద్ర వేసి, చివరకు ఏం సాధించారో చెప్పాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చుచేసిందో, కోర్టులకు ఎంతసొమ్ము ఖర్చుచేసిందో చెప్పాలన్నారు. పంచాయతీలకు వచ్చే నిధులనుకూడా కాజేస్తున్నారని, చివరకు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదన్నారు.

అవినీతిలోనుంచి  పార్టీని పుట్టించి, క్విడ్ ప్రోకోతో లక్షలకోట్లు సంపాదించినవ్యక్తి, అవినీతిని తరిమేస్తాను, అవినీతిపరులను శిక్షిస్తాననడం సిగ్గుచేటని బుచ్చయ్య చౌదరి తెలిపారు. కులతత్వంతో పాలనచేస్తే చివరకు నష్టపోయేది మీరేననే విషయాన్ని గ్రహిస్తే మంచిదన్నారు. కమ్మద్వేషం తగ్గించుకొని, రాష్ట్రం గురించి ఆలోచిస్తే అందరికీ మంచిదని గోరంట్ల హితవుపలికారు.