1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Will Delhi result see BJP pampering YS Jaganmohan Reddy?

రాజ్యసభ సీట్లిస్తాం... కేసుల నుంచి వెసులుబాటు కల్పించండి.. జగన్ ఢిల్లీ టూర్ అంతర్యమిదేనా?

YS Jagan Mohan Reddy
రాజ్యసభకు త్వరలో ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా రాజ్యసభలో వైకాపాకు సంఖ్యాబలం పెరగనుంది. అంటే.. నాలుగు స్థానాలు వైకాపా ఖాతాలో చేరనున్నాయి. ఈ సంఖ్యను అడ్డుపెట్టుకుని ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసుల నుంచి వెసులుబాటు పొందాలన్న ఎత్తుడగడ వేశారు. ఇందుకోసమే ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారనే వార్తలు వస్తున్నాయి. 
 
అలాగే, శాసనమండలి రద్దుకు ఆమోదంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయితే జగన్ గొంతెమ్మ కోర్కెలు విన్న మోడీ, అమిత్ షాలు ఒకింత షాక్‌కు గురైనట్టు వినికిడి. జగన్ అలవికాని కోర్కెలు తీర్చడం అసాధ్యమని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 
 
ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ సంఖ్యాబలం పెరగనుండటాన్ని అవకాశంగా తీసుకొని  కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలు పొందాలని జగన్‌ భావిస్తున్నారన్నది వారి తాజా అంచనా. రాజ్యసభలో తమ సంఖ్యాబలం ఆరుకు పెరుగుతుందని, వీరంతా బీజేపీకి అండగా నిలబడతారని, అవసరమైతే కొత్తగా వచ్చి చేరే నాలుగులో కమలనాథుల కోసం ఒకటి, రెండు సీట్లు త్యాగం చేయడానికైనా సిద్ధమేనని ఆయన ప్రతిపాదించినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
 
అయితే రాజ్యసభలో బలం పెంచుకునేందుకు వైసీపీ సహకారం తీసుకోవడం రాజకీయంగా తమకు ప్రయోజనం చేకూరుస్తుందా, లేదా అనే విషయమై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.
 
కాగా, సీబీఐ కోర్టులో తనపై పెరుగుతున్న ఒత్తిడి నుంచి వెసులుబాటు కల్పించడం, రాష్ట్రంలో తాను తీసుకున్న మండలి రద్దు, హైకోర్టు తరలింపు నిర్ణయాలకు వేగవంతంగా ఆమోద ముద్ర వేయడం వంటివాటితో పాటు ఆర్థిక చేయూత కోసం కేంద్రానికి జగన్‌ స్నేహహస్తం చాపారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 
 
అందులో భాగంగానే రాజ్యసభలో పెరగనున్న తమ బలాన్ని ఫణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నాయి. అయితే ఈ విషయంలో అధిష్టానం ఆచితూచి స్పందిస్తుందని, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. 
తర్వాతి కథనం
కేంద్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా... విజయసాయిరెడ్డికి మొండిచేయి?