శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 5 మే 2021 (13:24 IST)

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచే కర్ఫ్యూ, నిబంధనలు, మినహాయింపులు

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అన్ని వ్యాపారాలు, షాపులకు అనుమతి. అప్పుడు కూడా జనం గుంపులుగా తిరగకూడదు, గుమి గూడకూడదు. ఆ తరువాత అంటే మధ్యాహ్నం 12 నుంచి మరునాడు ఉదయం 6 వరకూ అన్నీ మూసేయాలి. మే 18వ తేదీ వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.

 
ఈ జాబితాలో ఉన్నవాటికి కర్ఫ్యూ వర్తించదు:
ఆసుపత్రులు, వైద్య పరీక్ష ల్యాబులు, మందుల షాపులు
మీడియా
టెలికాం, ఇంటర్నెట్, ఐటి ఆధారిత సేవలు
పెట్రోల్, గ్యాస్ పంపులు, గ్యాస్ డిపోలు
కరెంటు స్టేషన్లు
నీటి సరఫరా, పారిశుద్ధ్యం
కోల్డ్ స్టోరేజీలు, గోదాములు
ప్రైవేటు సెక్యూరిటీ సేవలు

 
అన్ని తయారీ రంగ పరిశ్రమలూ నడుపుకోవచ్చు. పరిశ్రమల శాఖ చెప్పినట్టుగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. అన్ని వ్యవసాయ పనులూ చేసుకోవచ్చు. వ్యవసాయ శాఖ చెప్పినట్టుగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మధ్యాహ్నం 12 తరువాత ఉదయం 6 లోపు అన్ని రకాల వాహనాలూ, ప్రయాణాలు నిషిద్ధం.

 
ఈ కింది వాటికి మినహాయింపు:
ప్రభుత్వ, కోర్టుల, స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది - వీరు కూడా ఐడి కార్డ్, డ్యూటీ పాస్ చూపించాలి. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు సేవలు అందించేవారు తిరగవచ్చు - ఐడికార్డు చూపించాలి.
గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులు చికిత్స కోసం వెళ్లవచ్చు. వారి వాహనాల్లో తిరగవచ్చు.

 
కోవిడ్ వ్యాక్సీన్ కోసం వెళ్లేవారు ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు, వెళ్లే వారు వెళ్లవచ్చు. కానీ వారు టికెట్ చూపించాలి. స్థానికంగా అధికారులు వాటికి ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య అన్ని రకాల సరకు రవాణాకు అనుమతి. ఆటోలు, టాక్సీలు, సిటీ బస్సులు వంటి స్థానిక రవాణా సేవలు 6-12 మధ్యే తిరగాలి. అప్పుడు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి.

 
జిల్లా లోపల, జిల్లాల మధ్య ప్రజా రవాణా అనుమతించరు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు కూడా 12-6 వరకూ నిషేధం. పెళ్లిళ్లు వంటివి తేదీలు మార్చకూడదు. గరిష్టంగా 20 మందితో చేసుకోవాలి. దానికి స్థానికంగా అనుమతి తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు పాటించాలి.

 
ఆయా కేటగిరీల వారికి ఉన్నతాధికారులు పాసులు జారీ చేయాలి. ఇవన్నీ మే 5 నుంచి రెండు వారాలు అమల్లో ఉంటాయి. 6-12 మధ్య కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా కలెక్టర్లు సెక్షన్ 144 విధించాలి. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపిసి సెక్షన్ 188, విపత్తు నివారణ చట్టం సెక్షన్ 51 నుంచి 60, ఇతర చట్టాల కింద కేసులు పెడతారు.