గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (12:46 IST)

కరోనా రహిత గ్రామంగా ఉప్పరపాలెం.. ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు..

దేశంతో పాటు తెలుగు రాష్ట్రాలు కరోనాతో నానా తంటాలు పడుతుంటే.. ఏపీలోని గుంటూరు జిల్లా వినుకొండకు ఆనుకుని వున్న చిన్న పల్లెటూరు మాత్రం నిశ్చింతగా వుంటోంది. ఆ గ్రామంలో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఫలితంగా కరోనా రహిత గ్రామంగా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. 
 
కరోనాను ఆ గ్రామంలోకి రానీయకుండా గ్రామస్తులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. వినుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పరపాలెంలో 4 వేల జనాభా ఉన్నారు. 
 
సర్పంచ్‌ గోపు కృష్ణ ఆధ్వర్యంలో యువత కమిటీలుగా ఏర్పడి ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బయటి నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉంటున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని ఊరి మొత్తం అప్పుడప్పుడు చల్లుతున్నారు.
 
ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఎవరికి వారు స్వచ్ఛందంగా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.