శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (11:37 IST)

కరోనా భయం... ఏసీ బోగీల వైపు కన్నెత్తి చూడిని ప్రయాణికులు

ప్రపంచం కరోనా భయం గుప్పెట్లో బతుకుతోంది. ఈ వైరస్ కారణంగా శీతలీకరణ ప్రదేశాల్లో ఉండేందుకు కూడా జనం జడుసుకుంటున్నారు. చివరకు రైలు ఏసీ బోగీల్లో కూడా ప్రయాణం చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా రైలు బోగీలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. 
 
ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారు ఏసీ బోగీలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్లలో ప్రయాణించే వారిలో ఎక్కువమంది స్లీపర్ క్లాసునే ఎంచుకుంటున్నారు. దీంతో ఏసీ బోగీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. 
 
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో స్లీపర్ క్లాసులకు ఫుల్ డిమాండ్ ఉండగా, ఏసీ కోచ్‌లను బుక్ చేసుకునే వారి సంఖ్య బహు స్వల్పంగా ఉంది. నిజానికి కరోనాకు ముందు ఏసీ బోగీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇక వెయింటింగ్ లిస్ట్ గురించి చెప్పక్కర్లేదు. 
 
కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ - బెంగళూరు - మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్, సెకండ్ క్లాస్, ధర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్ 150 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు కరోనాకు తోడు శీతాకాలం కావడంతో వీటికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. 
 
 కాచిగూడ - చెన్నై - చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ సహా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్లలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీల్లో ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతం మధ్య ఉందని తెలిపారు.