1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (17:00 IST)

దేశంలో రూ.200కు చేరనున్న పెట్రోల్ ధర???

దేశంలో పెట్రోల్ ధర లీటరు రూ.200 చేరుకోవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి కారణం దేశ అవసరాలకు సరిపడిన ఇంధనలో 80 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమేనని ఇంధన పెరుగుదలకు ప్రధాన కారణం కావొచ్చని పలువురు ఇంధన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. దీంతో ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి భారాన్ని కాస్త దింపింది. దీంతో పెట్రోల్ ధరలు కాస్త తగ్గాయి. 
 
అయితే, ఈ ఉపశమనం తాత్కాలికమేనని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరుగుతాయని ఆయన అంచనా వేసి బాంబు పేల్చారు. దేశంలో రానున్న నెలల్లో ఇంధన ధరల పెరుగుదలపై ఇంధన నిపుణులు స్పందిస్తూ, 2023 నాటికి మరో 100 రూపాయలు పెరిగి లీటర్ పెట్రోల్ 200 రూపాయలు అవుతుందని ఆయన అంచనా వేశారు. 
 
దేశంలో వినియోగించే చమురులో 86 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది కాబట్టి.. వీటి ధరలు కేంద్రం నియంత్రణలో ఉండవన్నారు. డిమాండ్-సరఫరాలో సమతుల్యం లేనప్పుడల్లా ధరలు పెరుగుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఇంధన ధరలను అదుపు చేయాలంటే ఏకైక మార్గం జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని వారు సలహా ఇస్తున్నారు.