ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 6 నవంబరు 2021 (15:07 IST)

పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదు... తుగ్ల‌క్!

అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.

 
 జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని, అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పుడు ఏం చేప్పారు...ఇప్పుడు జగన్‌ ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్‌ది తుగ్లక్‌ పాలన కాక మరేమిటన్నారు. అధికారం ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్‌ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

 
పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్‌ పాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
కర్నాటక పెట్రోల్ పై రూ.7లు, డీజిల్ పై రూ.7 తగ్గించింది. తమిళనాడు పెట్రోల్, డీజిల్ పై రూ.3లు తగ్గించింది. అస్సాం, గోవా త్రిపురు, గుజరాత్, మణిపూర్ మిజోరం, సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ రూ.7 తగ్గించాయి. హర్యానా పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.12 తగ్గించింది. మధ్యప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 4 శాతం వ్యాట్ తగ్గించింది. హిమాచల్ ప్రదేశ్ పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17లు, అరుణాచల్ ప్రదేశ్ పెట్రోల్, డీజిల్ పై 5.5శాతం వ్యాట్ తగ్గించింది. ఢిల్లీ పెట్రోల్ పై రూ.6.07లు, డీజిల్ పై రూ.11.75 పైసలు తగ్గించారు. రాజస్థాన్ వ్యాట్ తగ్గించింది. కోవిడ్ వల్ల ఇబ్బందులు పడ్డవారి కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాయి. మీరెందుకు చేయరు జగన్మోహన్ రెడ్డి అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.