1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (09:26 IST)

ముందు నవ్యాంధ్ర రాజధాని ఎక్కడో చెప్పండి : ఆర్బీఐ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి భారత రిజర్వు బ్యాంకు చెంప ఛెళ్లుమనిపించింది. నవ్యాంధ్యకు రాజధాని ఎక్కడో ముందు తేల్చండి. ఆ తర్వాత ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు సంగతి చూద్దాం అంటూ ఆర్బీఐ డిప్యూటీ మేనేజరు తాజాగా ఓ లేఖ రాశారు. 
 
కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలంటూ అమరావతి అభివృద్ధి సంస్థ ఛైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు ఆర్బీఐ అధికారులకు గత యేడాది అక్టోబరు నెల 12వ తేదీన ఓ లేఖ రాశారు. 
 
దీనిపై ఆర్బీఐ డిప్యూటీ మేనేజరు ఎంకే సుభాశ్రీ లేఖ ద్వారా సమాధానమిచ్చింది. ముందుగా నవ్యాంధ్రకు రాజధాని ఎక్కడో చెప్పండి అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీకి రాజధాని ఎక్కడో ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ తర్వాతే ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆమె తేల్చి చెప్పారు. 
 
అంతేకాకుండా, ఏపీలో ప్రస్తుతం 104 కరెన్సీ పెట్టెలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ, భద్రత కమిటీల సమావేశాల్లో కూడా ఈ పెట్టెల కొరత గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అందువల్ల కరెన్సీ పెట్టెల కొరత కూడా ఏపీలో లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.