1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (17:43 IST)

ఏపీలో కొత్తగా 3 వేల పాజిటివ్ కేసులు : కర్ఫ్యూ సమయం కుదింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో మరో 3841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 90,574 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా 3,841 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 760 కేసులు నమోదు కాగా... కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 45 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 38 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 
 
మరోవైపు 3,963 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,93,354కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 18,42,432 మంది కోలుకున్నారు. 12,744 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
ఇదిలావుంటే, రాష్ట్రంలో గురువారం నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల సడలించారు. కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో ప్రభుత్వం సడలింపులిచ్చింది. ఆ 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. 
 
రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా అన్నీ మూసివేయాలి. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంది. ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి మరుసటిరోజు ఉదయం 6వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 
 
ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి జులై 7వ తేదీ వరకు తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో సడలింపుపై మళ్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు విడుదల చేసే అవకాశముంది.