1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (09:26 IST)

హెటిరోకు జగన్ సర్కార్ భారీ గిఫ్ట్ : కేసు పెట్టలేదుకదా భూములు అప్పగింత

విశాఖపట్టణం జిల్లా నక్కపల్లిలోవున్న హెటిరో డ్రగ్స్‌ ఫార్మా కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ బహుమతి ఇచ్చింది. ఎకరం రూ.50 లక్షలు పలుకుతున్న నక్కపల్లి ప్రాంతంలో అతి కారు చౌకగా అంటే కేవలం సగం ధరకే విక్రయించింది. ఇలా ఏకంగా 81 ఎకరాల భూములను అప్పనంగా అప్పగించింది. ఇది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
విశాఖ బీచ్‌రోడ్డులోని బేపార్కును ఏడెనిమిది నెలలక్రితం హెటిరో డ్రగ్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసినట్టు అప్పట్లో చెప్పుకొన్నారు. త్వరలో విశాఖ నుంచి పాలన సాగించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌ రెడ్డి నివాసం కోసమే బేపార్కు లావాదేవీ నడిచినట్టు అప్పట్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. 
 
ఇందుకు ప్రతిఫలంగానే క్విడ్‌ ప్రొ కో విధానంలో అతి తక్కువ ధరకు హెటిరోకు 81 ఎకరాలు ఇచ్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశం హెటిరోకు భూములు కేటాయిస్తూ....ఆమోదముద్రవేసింది. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ తన పరిసర గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, శ్మశానాలను ఆక్రమించుకుంది. 
 
ఆ మేరకు కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా... వారికే తక్కువ ధరకు వాటిని ప్రభుత్వం ధారాదత్తం చేయాలని నిర్ణయించడం ఒక విచిత్రమైతే.. బహిరంగ మార్కెట్‌ రేటుతో పోల్చితే సగం ధరకే కేవలం రూ.25 లక్షల చొప్పున హెటిరోకు ఈ భూములు ఇవ్వాలని నిర్ణయించడం మరింత విడ్డూరం. ఈ భూములన్నీ జాతీయరహదారిని ఆనుకుని వుండటం గమనార్హం.