1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (13:01 IST)

ఏపీ మంత్రివర్గ సమావేశం... నిధుల సమీకరణపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఈ భేటీ సచివాలయంలోని మొదటిబ్లాక్‌లో జ‌రుగుతుంది. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా నూతన ఐటీ విధానంపై చ‌ర్చిస్తున్నారు. అలాగే, రాష్ట్రంలో అమ‌లు చేస్తోన్న‌ వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల, నిధుల సమీకరణపై చ‌ర్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో నెల‌కొన్న‌ జల వివాదాల గురించి కూడా మంత్రుల‌తో జ‌గ‌న్మోహన్ రెడ్డి వివరంగా చ‌ర్చిస్తున్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ప్రైవేట్ వ‌ర్సిటీల నియంత్రణ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి అంశాలపై కేబినెట్‌లో చర్చించే అవ‌కాశం ఉంది.
 
ఈ కేబినెట్ భేటీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు ఆమోద ముద్ర వేయ‌నున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు సాగు భూముల పంపిణీపై కూడా నిర్ణ‌యాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇళ్ల స్థలాలు క్రమబద్దీకరించే విష‌యంలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది.
 
టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం రూ.5,900 కోట్ల రుణానికి బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చే అంశంపై మంత్రుల అభిప్రాయాల‌ను జ‌గ‌న్ తీసుకోనున్నారు. క‌రోనా నియంత్రణతో పాటు మూడో దశ వ్యాప్తి జ‌రిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల వంటి అంశాలు కూడా చ‌ర్చించే అవకాశం ఉంది.