1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 19 జులై 2020 (10:27 IST)

దేశంలో కరోనా సామాజిక సంక్రమణ ప్రారంభమైంది : ఐఎంఏ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టలు తెంచుకుంది. ఇప్పటికే ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరో హెచ్చరిక చేసింది. 
 
దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని, ప్రస్తుత పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఐఎంఏ హెచ్చరించింది. రోజుకు సగటున 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయని, ఇప్పుడు గ్రామాలకు కూడా కేసులు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
 
పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్‌ను నియంత్రించడం కష్టమైనపనేనని ఐఎంఏ హాస్పిటల్ బోర్డు ఆఫ్ ఇండియా డైరెక్టర్ వీకే మోంగా అన్నారు.
 
వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు రెండే మార్గాలు ఉన్నాయని, మొదటిది మొత్తం జనాభాలో 70 శాతం మందికి వైరస్ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుందని, రెండోది టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడమని మోంగా వివరించారు
 
ఇదిలావుంటే, గత 24 గంటల్లో భారత్‌లో 38,902 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదేసమయంలో 543 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,77,618కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 26,816కి పెరిగింది. 3,73,379 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,77,423 మంది కోలుకున్నారు.
 
కాగా, శనివారం వరకు దేశంలో మొత్తం 1,37,91,869 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,58,127 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.