1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మే 2021 (15:04 IST)

రోగ నిరోధక శక్తిని దెబ్బతీసే భయం... వైద్యులు హెచ్చరిక

అనేక దేశాల్లో కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కొవిడ్‌పై రకరకాల అపోహలు, అపనమ్మకాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటున్నాయి. 
 
ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ఈ రోజుల్లో వాటిలో వచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, గూగుల్‌లో శోధించి ఇంకొందరు సొంతంగా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరం లేకపోయినా కొందరు సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నారు. 
 
కొందరైతే స్వల్ప లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం ఒక మార్గదర్శిని(గైడ్‌)ని రూపొందించింది. ముఖ్యంగా ఏ ఒక్కరూ భయపడొద్దని కోరుతోంది. భయం మనిషిలోని రోగనిరోధక శక్తిని కుంగదీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా, అపోహలతో అనవసర భయాలు పెరుగుతాయి. భయం వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.   ఇప్పటివరకు 20 వేల మంది కొవిడ్‌ రోగులకు విజయవంతంగా చికిత్స అందించాం. ఆ అనుభవంతో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఈ మార్గదర్శినిని తీర్చిదిద్దాం. త్వరలో అన్ని ప్రాంతీయ భాషల్లో దీన్ని అందిస్తాం. 
 
భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ప్రత్యేక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే కృషి జరగాలి. అప్పుడే ఎక్కడ, ఏ సేవలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం అందుబాటులో ఉంటుంది. దిల్లీ, బెంగళూరులో కొంతవరకు ఈ ప్రయత్నం జరిగింది.