శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (11:07 IST)

పెరిగిన కరోనా స్ట్రెయిన్ కేసులు : కరోనా తాజా కేసుల అప్డేట్స్

బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు మన దేశంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్త కరోనా కేసులు 8 రాగా, మొత్తం కేసుల సంఖ్య 90కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన కేంద్రం, బ్రిటన్ నుంచి విమానాల్లో వచ్చిన ప్రయాణికుల కారణంగానే ఈ వైరస్ ఇండియాకు వచ్చిందని నిపుణులు అంటున్నారు.
 
యూకే నుంచి వచ్చిన విమానాల్లో వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలనూ సేకరించామని, తొలి కొత్త స్ట్రెయిన్ డిసెంబర్ 30న వెలుగులోకి వచ్చిందని గుర్తు చేసిన అధికారులు, తొలుత ఆరుగురికి వైరస్ సోకినట్టు గుర్తించామని, ఆపై కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, బ్రిటన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ, వారి కుటుంబీకులను, వారితో సన్నిహితంగా మెలిగిన అందరినీ గుర్తిస్తున్నామని వెల్లడించారు.
 
గత 38 రోజుల్లో బ్రిటన్‌కు వెళ్లి వచ్చిన వారందరినీ అబ్జర్వేషన్‌లోనే ఉంచామని స్పష్టం చేశారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య మొత్తం 33 వేల మందికి పైగా ప్రయాణికులు ఇండియాకు వచ్చారని, అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేశామని కేంద్ర అధికారులు వెల్లడించారు. 
 
బ్రిటన్‌తో పాటుడెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్‌ల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు చేసిన తరువాతనే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు.
 
ఇకపోతే, దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 18,645 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 19,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,50,284కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,50,999 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,75,950మంది కోలుకున్నారు. 2,23,335 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
   
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 18,10,96,622 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,43,307 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర  వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 415 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,784 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,463  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,565 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,756 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,584 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 65 కరోనా కేసులు నమోదయ్యాయి.