శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 జనవరి 2021 (21:18 IST)

రికార్డ్ సృష్టించనున్న ఇండియన్ మహిళా పైలెట్లు, గగనంలో 17 గంటలపాటు 16,000 కి.మీ దూరం

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
మన భారతదేశ మహిళామణులు మరో రికార్డు సృష్టించబోతున్నారు. గగనతలంలో సుమారు 17 గంటల పాటు విమానాన్ని 16,000 కిలోమీటర్లు నడిపి చరిత్ర సృష్టించనున్నారు. అంతా మహిళలతో కూడిన పైలట్ బృందం 16,000 కిలోమీటర్ల దూరాన్ని కలిగి, ప్రపంచంలోనే అతి పొడవైన విమాన మార్గమైన ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడంతో భారత మహిళలు చరిత్రను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
 
ఉత్తర ధ్రువం ద్వారా ప్రయాణించడం పెద్ద సవాలు. అందుకే ఈ మార్గంలో విమానం నడపాలంటే ఎంతో నైపుణ్యం వుండాలని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. "ఉత్తర ధ్రువం ద్వారా ప్రయాణించేందుకు, విమానాన్ని నడిపేందుకు విమానయాన సంస్థలు తమ ఉత్తమ, అనుభవజ్ఞులైన పైలట్లను ఈ మార్గంలో పంపుతాయి. ఈసారి శాన్‌ఫ్రాన్సికో నుండి ధ్రువ మార్గం ద్వారా బెంగళూరుకు ప్రయాణానికి ఎయిర్ ఇండియా ఒక మహిళా కెప్టెన్‌కి బాధ్యతలు అప్పగించింది" అని అధికారి తెలిపారు.
 
దీనిపై ఫ్లైట్ కమాండ్ చేయబోయే జోయా అగర్వాల్ స్పందిస్తూ "కల నిజమైంది" అని అభివర్ణించారు. జనవరి 9న ఈ క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. "ప్రపంచంలోని చాలామంది ప్రజలు తమ జీవితకాలంలో ఉత్తర ధృవాన్ని లేదా దాని పటాన్ని కూడా చూడలేరు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నాపై ఉంచిన నమ్మకాన్ని అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు వచ్చిన ఓ సువర్ణావకాశం. బోయింగ్ 777 ఉత్తర ధ్రువంపై ప్రయాణించే విమానాల్లో ప్రపంచంలోనే అతి పొడవైన విమానాలలో ఇది ఒకటి "అని అగర్వాల్ చెప్పారు.
 
నాతో కెప్టెన్లు తన్మై పాపగారి, ఆకాంక్ష సోనావనే, శివానీ మన్హాస్లతో కూడిన అనుభవజ్ఞులైన మహిళా బృందాన్ని కలిగి ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. ఆల్-ఉమెన్ పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణిస్తూ, చరిత్రను సృష్టించడం ఇదే మొదటిసారి అని అన్నారు అగర్వాల్.