మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: గురువారం, 9 ఏప్రియల్ 2020 (18:31 IST)

కరోనా వైరస్ సోకినప్పుడు ఒళ్లంతా జలదరించింది, తిరుపతిలో డిశ్చార్జ్ అయిన కరోనా బాధితుడు

కరోనా వైరస్ అంటేనే జనం ప్రస్తుతం వణికిపోతున్నారు. కరోనా సోకితే.. ఇక చెప్పాలా? అయితే ఆ యువకుడు మాత్రం భయపడలేదు. ధైర్యంగా కరోనా వైరస్ నుంచి బయటపడతానని నమ్మకాన్ని పెట్టుకున్నాడు. వైద్యులు సహకరించారు. స్నేహపూర్వకంగా అతనికి చికిత్స చేశారు. ఇంకేముంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. నెగిటివ్ రిపోర్ట్‌తో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశాడు.
 
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 యేళ్ళ యువకుడు లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చాడు. స్నేహితులతో తిరిగాడు. తీవ్ర జలుబు, దగ్గు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ పాజిటివ్ అని వచ్చింది. చిత్తూరు జిల్లాలోనే మొదటి పాజిటివ్ కేసు అతనే.
 
పాజిటివ్ రాగానే అతను మనోధైర్యం కోల్పోలేదు. 25 యేళ్ళ ప్రాయంలో ధైర్యంగా నిలబడ్డాడు. బతకగలనని ఆత్మస్థైర్యంతో ఉన్నాడు. మూడువారాల పాటు తిరుపతిలో రుయా వైద్యులు చికిత్స చేశారు. దీంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో అతని రక్తనమూనాలను ముందుగా పంపించారు. రెండుసార్లు నెగిటివ్ వచ్చింది. ఆ తరువాత పుణేకు పంపించిన రక్తనమూనాల రిపోర్ట్‌లో కూడా నెగిటివ్ రావడంతో ఇక అతన్ని ఇంటికి పంపించేశారు. అయితే 14 రోజుల పాటు ఇంటిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. 
 
డిశ్చార్జ్ అయిన తరువాత ఆ యువకుడు మీడియాతో మాట్లాడాడు. మొదట్లో కరోనా సోకినప్పుడు ఒళ్ళంతా జలదరించినట్లు అనిపించింది. కొన్నిరోజులు భయపడ్డాను. అయితే వైద్యులందరూ స్నేహపూర్వకంగా ట్రీట్మెంట్ ఇస్తుండటం, నా శరీరంలో జరుగుతున్న మార్పులను నేనే గమనించా. ఇక ధైర్యంగా ఉన్నా ఆ నమ్మకమే నన్ను బతికించింది అంటున్నాడు ఆ యువకుడు.