1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (19:21 IST)

ఆంధ్రాలో 12 వేల కరోనా కేసులు - 12 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,561 మందికి ఈ వైరస్ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,635 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ సోకి 12 మంది చనిపోయారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరులో 1,625, కడపలో 1,215, విశాఖపట్టణంలో 1,211 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేవిధంగా మృతుల్లో విశాఖలో మూడు, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరేసి, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కరేసి చొప్పున కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ 12 మంది మృతులతో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 14,591కు చేరింది. అలాగే, ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల  సంఖ్య 22,48,608కి చేరగా 21,20,717 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.