శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (10:18 IST)

టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు కరోనా పాజిటివ్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు. "వైద్యుల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నా. కొన్ని రోజులుగా తనను కలిసివారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను" అని పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. తాను కోవిడ్ బారినపడినట్టు బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. అలాగే, ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
కాగా, చంద్రబాబు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. ఆ తర్వాత గుంటూరు జిల్లా కారంచేడులో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త అంతిమ యాత్రలో పాల్గొని పాడె కూడా మోసారు. అలాగే, మరికొన్ని ప్రజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆయన సోమవారం వెల్లడించి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు.