ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (16:58 IST)

కడప రిమ్స్‌లో 70 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. రోజూవారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కాలేజీలో 150 మంది ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు ఉండగా, వారిలో 70 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
నిజానికి మంగళవారం నుంచి ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, విద్యార్థులు అనేక మంది కోవిడ్ బారినపడటంతో మిగిలిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కరోనా భయం నీడలోనే కోవిడ్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్ 
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం కోలుకునేవరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని వెల్లడించారు.
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, "నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నాకు కరోనా లక్షణాలు ఏవీ లేవు. అలాగే, బాగానే ఉన్నాను. కానీ, నేను కోలుకునేవరకు ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసివారంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు. 
 
రేపటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ...  
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఇటీవలికాలంలో ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించి అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, ఈ నెల 18వ తేదీ అర్థరాత్రి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకిరానుంది. వాస్తవానికి ఈ కర్ఫ్యూను ఇదివరకే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాత్రిపూట కర్ఫ్యూ అమలును వాయిదావేసింది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 4,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 30,022 మంది వద్ద శాంపిల్స్ సేకరించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 4,570 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,124 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, విశాఖలో 1,028, గంటూరులో 368, అనంతపురంలో 347 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 669 మంది కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. 
 
స్కూల్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్... 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువైపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అన్ని విద్యా సంస్థలకు ఈ నెలాఖరు వరకు సెలవులు ప్రకటించారు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని చెప్పారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు స్కూల్స్ సెలవులు పొడగించవచ్చన్న వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏమాత్రం నిజంలేదు. యధావిధిగా సోమవారం నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయని తెలిపారు.