గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (09:26 IST)

ప్రతి 10 మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకింది : డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా మహమ్మారిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి పది మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు పేర్కొంది. మరెంతో మంది కరోనా సంబంధిత రోగాలతో సతమతమవుతున్నారని తెలిపారు. 
 
తమ అంచనా ప్రకారం ప్రపంచ జనాభాలో పది శాతం మందికి కరోనా వైరస్‌ సోకి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సోమవారం తెలిపింది. అయితే దేశాలు, ప్రాంతాలపరంగా ఇందులో వ్యత్యాసం ఉన్నదని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ప్రపంచంలోని మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉన్నదని హెచ్చరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నదని, ప్రపంచం మరింత కష్టకాలన్ని ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనాపై చర్చించేందుకు 34 సభ్య దేశాల ప్రతినిధుల ఎగ్జిక్యూటివ్ బోర్డుతో రయాన్ మాట్లాడారు. ప్రపంచంలోని సుమారు 76 కోట్ల మంది ఇప్పటికే వైరస్ బారిన పడ్డారన్న ఆయన, తమ అంచనాలు, జాన్సన్ హాకిన్స్ యూనివర్శిటీ అంచనాలు సరిపోతున్నాయని అన్నారు. కాగా, ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు మూడున్నర కోట్ల మందికి వైరస్ సోకిందన్న సంగతి తెలిసిందే. వీటిలో సగానికి పైగా కేసులు అమెరికా, ఇండియా, బ్రెజిల్, రష్యాల్లోనే నమోదయ్యాయి.
 
సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఆ సంస్థ టాప్‌ ఎమర్జెన్సీ ఎక్స్‌పర్ట్‌ మైక్ ర్యాన్ ఈ మేరకు తెలిపారు. ఆగ్నేయ ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యధరా ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తికి మూలమైన చైనాలో దర్యాప్తు కోసం అంతర్జాతీయ మిషన్‌లో పాల్గొనే నిపుణుల జాబితాను ఆ దేశ ఆమోదం కోసం డ్లబ్యూహెచ్‌ఓ పంపినట్లు మైక్ ర్యాన్ వెల్లడించారు.