శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2020 (16:52 IST)

మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఇంట్లో కరోనా కలకలం...

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, దక్షిణ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ ఇంట్లో కరోనా కలకలం రేగింది. గంభీర్ ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో తాను ఐసోలేషన్ లోకి వెళుతున్నట్టు గంభీర్ ప్రకటించారు. ప్రస్తుతం తాను కూడా కరోనా పరీక్షకు నమూనాలు పంపానని, మెడికల్ రిపోర్టు కోసం వేచి చూస్తున్నానని వెల్లడించారు.
 
కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని గంభీర్ సోషల్ మీడియాలో సూచించారు. కొన్ని వారాల కిందట ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపించినా, ఇటీవల మళ్లీ కరోనా ఉద్ధృతి మొదలైంది. నిత్యం 6 వేల వరకు కేసులు వస్తున్నాయి.
 
మరోవైపు, దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 47,638 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,11,724 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 55,331 మంది కోలుకున్నారు.
 
అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 670 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,24,985 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 77,65,966 మంది కోలుకున్నారు. 5,20,773 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.