శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (11:49 IST)

కరోనా నియంత్రణకు ఇంటింటికీ ఫీవర్ సర్వే

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలిపారు.

జగ్గయ్యపేటలోని 14 వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని కోవిడ్ రహిత ప్రాంతంగా చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్‌ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు కరోనాను కట్టడి చేయడానికి ఉపకరించాయని పేర్కొన్నారు.

ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఫీవర్ క్లీనిక్స్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కరోనా విపత్తులో ఇంటింటి సర్వేలను విజయవంతంగా నిర్వహించిందన్నారు. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించామని తెలియజేశారు.