1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2020 (10:36 IST)

స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్‌కు కరోనా... నాంపల్లి వాసుల వెన్నులో వణుకు

హైదరాబాద్ నగరంలో ఓ ఫుడె డెలివరీ బాయ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. పైగా, అతను ఫుడ్ డెలివరీ చేసిన గృహాలకు వెళ్లి ప్రతి ఒక్కరినీ అధికారులు తనిఖీ చేశారు. అయితే, వీరిలో ఏ ఒక్కరిలోనూ కరోనా లక్షణాలు ఇప్పటికీ బయటపడక పోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. 
 
కాగా, ఈ కరోనా పాజిటివ్ అని వచ్చిన యువకుడి ఫ్యామిలీ నాంపల్లి ప్రాంతంలో నివసిస్తోంది. ఈయన పెద్దన్న ఢిల్లీలో జరిగిన మర్కజ్ మీట్‌కు వెళ్లి మార్చి 19న తిరిగి వచ్చాడు. ఆపై మార్చి 20 తర్వాత బాధితుడు ఎవరికీ ఫుడ్ డెలివరీలు చేయకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
అయితే, ఈయన కుటుంబంలో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. దీంతో ఈ కుటుంబమంతా మార్చి 22 నుంచి హోమ్ క్వారంటైన్‌లోనే ఉందని తెలిపారు. బాధితుడి సోదరుడు న్యూఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ఆహారాన్ని డెలివరీ బాయ్ సరఫరా చేశాడని, అది జరిగి నెల రోజులు దాటిందని, ఎవరిలోనూ కరోనా లక్షణాలు లేవు కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, నాంపల్లిలోని ఇరుకు వీధుల్లో ఇతని కుటుంబం నివసిస్తూందని, ఏప్రిల్ 1న ఇతని సోదరుడికి వైరస్ పాజిటివ్ రావడంతో, కుటుంబం మొత్తాన్నీ ఐసోలేషన్ వార్డుకు తరలించామని నాంపల్లి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో అందరికీ వైరస్ పాజిటివ్ వచ్చిందని అన్నారు.
 
అదేవిధంగా, తమ డెలివరీ బాయ్‌కి కరోనా సోకడంపై స్విగ్గీ స్పందించింది. అతను క్రియాశీలకంగా లేడని, మార్చి 21 తర్వాత ఒక్క డెలివరీ కూడా చేయలేదని పేర్కొంది. తమ కస్టమర్ల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యతాంశమని, అధికారుల ఆదేశాలను తాము పాటిస్టున్నామని తెలిపింది.