మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (11:39 IST)

కరెన్సీ నోట్లపై కరోనా వైరస్... బోసిపోయిన తిరుమల ఏడు కొండలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్... ఇపుడు కరెన్సీ నోట్ల ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు సమాచారం. గతంలో ఈ-కొలి బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టఫి వంటి బ్యాక్టీరియాలు కూడా ఇదే విధంగా వ్యాపించినట్టు వైద్యులు గుర్తుచేస్తున్నారు. అందువల్ల కరెన్సీ నోట్ల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. 
 
కరెన్సీ అనేక మంది చేతులు మారుతుంటాయి. అందువల్లే ఈ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. 
 
గత 2018లో చేపట్టిన ఒక అధ్యయనంలో రూ.100, 50, 20, 10 నోట్ల నుంచి ఈ కొలీ బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫి, మరో రెండు ఇతర వైర్‌సలు వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ను పరిశీలించారు. వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్‌, ఇతర పరాన్నజీవులు ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి కరోనా కూడా కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు.
 
మరోవైపు, తిరుమల గిరులపై కరోనా ప్రభావంతో పాటు, ఈ విద్యా సంవత్సరం సీజన్‌లో తుది పరీక్షల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక, సోమవారం అయితే, ఈ రద్దీ మరింతగా తగ్గిపోయింది. 
 
ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒకే ఒక్క కంపార్టుమెంట్‌లో భక్తులు వేచి చూస్తున్నారు. స్వామి వారి అన్ని రకాల దర్శనాలకూ రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 
 
ఆదివారం నాడు స్వామిని 79,464 మంది భక్తులు దర్శించుకున్నారని, 28,104 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ద్వారా రూ.2.97 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. ఏప్రిల్ తొలివారం వరకూ రద్దీ సాధారణంగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.