న్యూజిలాండ్లో కరోనా విజృంభణ - భారత్లో 5 వేలు దాటిన కరోనా
కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. అనేక ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ వ్యాపిస్తోంది. న్యూజిలాండ్ దేశంలో కోవిడ్ 19, ఇతర శ్వాసకోశ వ్యాధుల అధికంగా ఉన్నాయి. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మురుగు నీటి పరీక్షల్లో ఈ వైరస్ వెలుగు చూస్తోంది. టీకా కార్యక్రమాలు ముమ్మరం చేసినా బూస్టర్ డోసులపై ప్రజల అనాసక్తి చూపుతున్నారు. మన దేశంలోనూ ఈ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత్లో ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరుకోగా, 24 మంది మృత్యువాతపడ్డారు.
జాతీయ వైద్య సలహా సేవా సంస్థ హెల్త్ లైన్కు ఫ్లా వంటి లక్షణాలతో బాధపడుతున్న వారి నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య పెరిగిందని రేడియో న్యూజిలాండ్ నేడు వెల్లడించింది. అయితే, గత యేడాదితో పోలిస్తే ఈ కాల్స్ సంఖ్య కొంత తక్కువగానే ఉందని పేర్కొంది. దేశంలో ఈ యేడాది అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువగా పడిపోగా, దక్షిణ ద్వీపంలోని కొన్ని ప్రాంతాల్లో మంచుతో కప్పుకుపోయాయి.
దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన అక్లాండ్ ప్రాంతంలో, జూన్ 1వ తేదీతో ముగిసిన వారంలో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది. అయినప్పటికీ మొత్తంమీద ఈ సంఖ్య గత యేడాది ఇదే సమయంతో పోలిస్తే సమానంగానే ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా మురుగునీటి పరీక్షల ద్వారా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్నాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ రీసెర్స్ వెల్లడించింది.