గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 31 అక్టోబరు 2020 (09:20 IST)

భారత్​లో వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధం!

భారత్​లో కొవిడ్​-19 వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది కేంద్రం. టీకా పంపిణీ సమయంలో పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
 
ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్​ కమిటీ(ఎస్​ఎస్​సీ​), అడిషనల్​ చీఫ్​ సెక్రటరీ/ప్రిన్సిపల్​ సెక్రటరీ(ఆరోగ్య శాఖ) అధ్యక్షతన రాష్ట్ర టాస్క్​ఫోర్స్​(ఎస్​టీఎఫ్), జిల్లా కలెక్టర్​ పర్యవేక్షణలో జిల్లా టాస్క్​ఫోర్స్​(డీటీఎఫ్​) ఏర్పాటు చేయాలి.
 
ఈ కమిటీలు శీతలీకరణ(కోల్ట్​ స్టోరేజీ) ఏర్పాట్లు, పంపిణీ ప్రణాళిక-కార్యాచరణ, రాష్ట్రాల్లో ఎదురయ్యే సవాళ్లు, రవాణా వ్యవస్థలు లేని కొండ, మారుమూల ప్రాంతాల్లోనూ పంపిణీ ఇబ్బందులు గుర్తించాలి. 
 
ఈ సమస్యలన్నింటికీ ఓ కార్యాచరణ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్​ అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు విభిన్న వ్యూహాలు, మెరుగైన సలహాల కోసం ఉద్యోగులు, సిబ్బంది నుంచి సూచనలు కోరతారు.
 
ప్రత్యేక బృందాలు చేయాల్సిన పనుల్లో నిధుల సేకరణ, పంపిణీ కార్యాచరణకు మార్గదర్శకాలు సిద్ధం చేయడం, జిల్లాల్లో పంపిణీ అమలుకు కాలపరిమితి నిర్ణయించడం, ప్రజలకు సాధారణ ఆరోగ్య సేవల్లో తక్కువ ఇబ్బందులు ఉండేలా చూడటం కీలకం.
 
తొలిదశలో హెల్త్​కేర్​ వర్కర్లకు టీకాలు వేయడం, అన్ని ప్రభుత్వ విభాగాల్లో మానవ వనరులను మ్యాపింగ్​ చేయడం, పంపిణీ సమయంలో లబ్ధిదారుల ధ్రువీకరణ, రద్దీ నియంత్రణపైనా దృష్టిసారించనున్నారు. 
 
రాష్ట్రస్థాయిలోని ప్రత్యేక బృందాలు జిల్లాల్లో పంపిణీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి. వ్యాక్సిన్​ వేయించుకున్న వారి వివరాలు నమోదు చేయడం, వారి డేటాబేస్​ పర్యవేక్షణ జిల్లా టాస్క్​ఫోర్స్​(డీటీఎఫ్​) చూసుకుంటుంది.
 
కరోనా వ్యాక్సినేషన్​ బెనిఫీషరీ మేనేజ్​మెంట్​ సిస్టమ్​(సీవీబీఎంఎస్​)పై సంబంధిత హెచ్​ఆర్​లు.. అధికారులకు శిక్షణ ఇస్తారు. 
 
వీటితో పాటు కమ్యునికేషన్​ వ్యవస్థ, కోల్డ్​చైన్​ మేనేజిమెంట్​ సహా వ్యాక్సిన్ తరలింపు వంటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయి డీటీఎఫ్​ బృందాలు. 
 
అన్నిస్థాయిల్లో కార్యచరణ పక్కాగా అమలయ్యేందుకు జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఎస్​ఎస్​సీ నెలకు ఒకసారి, ఎస్​టీఎఫ్​ 15 రోజులకు, డీటీఎఫ్​ వారానికి ఒకసారి తమ బృందాలతో సమావేశమవ్వాల్సి ఉంటుంది. 
 
ఉత్తమ పనితీరు కనిబరిచిన జిల్లా, బ్లాక్​, అర్బన్​, వార్డుల్లోని అధికారులు,సభ్యులకు.. రివార్డులు, ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది ప్రభుత్వం.