గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (15:55 IST)

అత్యంత డేంజర్‌గా కరోనా న్యూ వేరియంట్... ఒకరి నుంచి ముగ్గురికి వ్యాప్తి..

దేశంలో కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటుంది. ఇలాంటి రూపాల్లో ఒకటి రెండో దశ వైరస్. ఇప్పటికే దేశంలో రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఇది ఒకరి నుంచి ముగ్గురు సోకుతుందట. ఇది 2 నుంచి 2.5 రెట్లు శక్తిమంతమైన వైరస్ అని గుర్తించారు. ఇందువల్లే దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్టు సమాచారం. 
 
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఎంతో ప్రమాదకరం అని పరిశోధకులు వెల్లడించారు. ఇది ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వ్యాప్తి చెందుతోందని, ఆ ముగ్గురి నుంచి అది మరింతమందికి వ్యాపిస్తోందని వివరించారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందని, తొలి దశ కంటే రెండో దశ వైరస్ 2 నుంచి 2.5 రెట్లు అధిక శక్తిమంతమైనదని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ కారణంగా కేసులే కాదు, మరణాలు కూడా పెరుగుతున్నాయని టాటా ఇన్ స్టిట్యూట్ ప్రాజెక్ట్ సమన్వయకర్త సందీప్ జునేజా పేర్కొన్నారు. 
 
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొవిడ్ మృత్యుఘంటికలు మోగించడానికి గల కారణాలను పరిశోధిస్తున్నామని పరిశోధక బృందం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ఇదే ఊపులో కొనసాగితే జూన్ 1 నాటికి కరోనా మరణాల సంఖ్య అదుపులోకి వస్తుందని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, గత కొన్నిరోజులుగా కరోనా సునామీని చవిచూసిన భారత్‌లో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖంపడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో 3,20,289 మంది కోలుకోగా... 3,449 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది.  ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. 
 
ఇప్పటివరకు భారత్‌లో 2,02,82,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,66,13,292 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 34,47,133 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే... 15,89,32,921 మందికి టీకాలు వేశారు.